వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీలో సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదటి వారం నుండి దాదాపు పదిహేను రోజుల పాటు ఈ వీడియో అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ వీడియో పై టీడీపీ ఓ పక్క రచ్చ చేయగా, వైసీపీ అది ఫేక్ వీడియో, మార్ఫింగ్ అంటూ ఖండిస్తూ వచ్చింది. ఆ వ్యవహారం ఇప్పుడిప్పుడే సద్దుమణి వేరే వ్యవహారాలపై టాపిక్ మళ్లింది. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం మీడియా నుండి డైవర్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం నుండి ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మకు దానిపై లేఖ రావడంతో మళ్లీ మాధవ్ వీడియో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల క్రితం డిగ్నటీ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో మహిళా నాయకురాళ్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఫిర్యాదు అందజేశారు. రాష్ట్రానికి చెందిన ఎంపీ వ్యవహారం ఈ విధంగా ఉంది. ఆయనకు సంబంధించిన వీడియో బయటకు వస్తే దాన్ని కొందరు నిజమని అంటుండగా, మరి కొందరు మార్ఫింగ్ అంటున్నారు. ఓ పార్లమెంట్ సభ్యుడు ఈ విధంగా వ్యవహరించడం కరెక్టు కాదు. దీనిపై అనుమానాలు ఉన్నాయి. నిజమా..? కాదా అని తేల్చడం లేదు. ఇది మహిళల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై విచారణ జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు వీడియో కానీని, వినతి పత్రాన్ని రాష్ట్రపతికి అందించారు.
రాష్ట్రపతి కార్యాలయం నుండి ఏపి సీఎస్ కు లేఖ
ఈ విషయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీరియస్ గానే స్పందించారు. తన కార్యాలయ సిబ్బందిని పిలిచి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రపతి కార్యాలయం నుండి ఏపి సీఎస్ కు దీనిపై లేఖ వచ్చింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. అయితే దీనిపై సీఎస్ ఏమైనా చర్యలు తీసుకుంటారా.. ? అంటే ఏమీ ఉండదు. రాష్ట్రపతి కార్యాలయం నుండి సీఎస్ కార్యాలయానికి లేఖ రావడం బ్రేకింగ్ న్యూస్ యే అయినప్పటికీ దానిపై అంతగా విచారణలు లాంటివి ఏమీ ఉండవు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై సీఎస్ కార్యాలయం నుండి రాష్ట్రపతి కార్యాలయానికి రిప్లై ఇస్తారు. ఈ వీడియో వ్యవహారం మా దృష్టికి వచ్చింది. దీనిపై అనంతపురం జిల్లా ఎస్పీ విచారణ జరిపారు. దాని ఒర్జినల్ వీడియో దొరికితే అది అసలైన వీడియోనా..? లేక మార్ఫింగ్ వీడియోనా..? అనేది నిర్ధారించగలమని చెప్పారు. దీనిపై ఏపీ సీఐడీ కూడా స్పందించింది. దానిపై విచారణ జరుపుతున్నాము అంటూ సీఎస్ రిప్లై ఇస్తారు. అంతకు మించి ఏమి జరగకపోవచ్చు.
ఎంపి గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్రపతి భవన్ కు గానీ, కేంద్రంలోని బీజేపీకి ఉందా అంటే లేదనే చెప్పవచ్చు. ఒక వేళ కేంద్రంలోని బీజేపీ యాక్షన్ తీసుకోవాలని భావిస్తేనే ఏదైనా కదలిక వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీకి ఆ అవసరం ఏమీ లేదు. అయితే రాష్ట్రపతి కార్యాలయం దీనిపై ఎందుకు స్పందించినట్లు సామాన్యులు భావిస్తుంటారు. సాధారణంగా ఎవరు రాష్ట్రపతి కార్యాలయానికి ఏ అంశంపైన అయినా ఫిర్యాదు చేసినా అదే విధంగా స్పందించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కాపీని పంపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం నుండి లేఖ పంపడం రివాజే. అయితే ఇటువంటి వీడియోనే ఎన్డీఏ వ్యతిరేక పక్షాలైన టీఎంసీ, ఆప్, డీఎంకే, టీఆర్ఎస్ వంటి పార్టీలకు చెందిన నాయకులదైతే యాక్షన్ మరోలా ఉండేది అన్న మాటలు వినబడుతున్నాయి.