రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు స్పెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంతకు ముందు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా పోలీసులు ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ కేసులో జీవిత ఖైదు పడే సెక్షన్ ను కూడా పోలీసులు యాడ్ చేయడంతో బెయిలు మంజూరు చేసేందుకు సికింద్రాబాద్ కోర్టు నిరాకరించింది. సెషన్స్ కోర్టుకు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.
తదుపరి భూమా అఖిలప్రియ తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ కు కస్టడీ విచారణ కూడా పూర్తి అయ్యిందని, ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే అఖిల ప్రియ కు మంజూరు చేస్తే ఇతర నిందితులు దొరికే అవకాశం లేదని, సాక్షులను ప్రభావితం చేస్తారని, మరిన్ని ఘటనలకు పాల్పడే అవకాశం కూడా ఉందని ఇంతకు ముందు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరు కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హఫీజ్ పేట భూ వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రావు, అతని సోదరులను భూమా అఖిలప్రియ మనుషులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో అఖిల ప్రియ ను ప్రథమ నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు. మొత్తం ఇప్పటికీ కేసులో 19 మందిని అరెస్టు చేశారు.