తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ వ్యూహాత్మకంగా చిక్కుకు పోయారా? రాజకీయ కారణాలు ఉన్నాయా? అఖిలప్రియ చుట్టూ భూవివాదమే కీలకంగా మారిందా? భర్త భార్గవ్ రామ్ గత చరిత్ర ముడిపడి ఉందా? ఫ్యాక్షన్ లింకులు ఉన్నాయా? ఆమె అరెస్టుపై టీడీపీ ఎందుకు స్పందించడం లేదు? ఏపీ పోలీసులపై విరుచుకుపడే చంద్రబాబు, లోకేశ్.. అఖిలప్రియ అరెస్టుపై తెలంగాణ పోలీసులను ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ కేసులో భూవివాదమేనా.. మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?.. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఒకవేళ ఉన్నా బయటకు రానివే. కేసులో లింకులు ఒక్కోటి బయటకు వస్తుంటే అఖిలప్రియ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు ఆమె భర్త భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను ఆచూకీ దొరక్కపోవడం కూడా ఆమెకు ప్రతికూలంగా మారుతున్నాయి.
ఆ ముగ్గరూ దొరికితే..
హఫీజ్పేట భూవివాదం ఇప్పటిది కాదు. కాకపోతే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఏం జరిగిందన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ భూవివాదం ఎంత తీవ్రం కాకపోతే ఆమె కిడ్నాప్ యత్నం చేశారో అనేది ఓ వాదన. కిడ్నాప్ వెనుక అదృశ్యశక్తులు బలంగా పనిచేస్తున్నారనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. పైకి ల్యాండ్ సెటిల్మెంట్, కిడ్నాప్, అంటున్నా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే అంశం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు పోలీసుల్లో కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆమె భర్త ఆచూకీ లభ్యమైతే అఖిలప్రియ పాత్రపై, కిడ్నాప్, భూవివాదం.. గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో ఇవే కాకుండా మరెన్నో విషయాలు ఉన్నాయనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇంతగా ఆమె భర్త, గుంటూరు శ్రీను తప్పించుకుంటున్నారంటే.. భూవివాదంలో మరెన్నో కీలక అంశాలు ఇమిడి ఉన్నాయనే అనుమానాలు వస్తున్నాయి.
టీడీపీ స్పందించదా..?
ఈ కేసులో ప్రవీణ్ రావు కుటుంబం తెలంగాణ సీఎం కేసీఆర్ కు బంధువులు కావడమే అఖిలప్రియ మరింత ఊబిలో చిక్కుకోవడానికి కారణం అని అంటున్నారు. ప్రవీణ్ రావుకు తెలంగాణ ప్రభుత్వం అండ ఉంటే.. పోలీసులపై ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది అనేది నిర్వివాదాంశం. టీడీపీతో పొసగని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా వెళ్లేలా చేసిందనే ఆరోపణలూ లేకపోలేదు. అందుకే టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్.. మాత్రమే కాకుండా తెలంగాణ టీడీపీ కూడా స్పందించలేదని అంటున్నారు. ఏపీ టీడీపీ నాయకులపై ఈగ వాలినా స్పందించే చంద్రబాబు.. తమ పార్టీలోని మాజీ మంత్రిపై జరిగిన కేసులో కనీసం సానుభూతి వ్యాఖ్యలైనా చేయకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఆమె మరింతగా ఈ కేసులో ఇరుక్కోవడానికి రాజకీయ ప్రమేయం ఉందనే వాదనలకు ఇవి బలాన్ని చేకూరుస్తున్నాయి.
వెనుక శక్తులేమైనా ఉన్నాయా..?
పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను ఆచూకీ లభ్యం కావడం లేదు. వీరు చిక్కితే కేసులో ఉన్న అసలు చిక్కుముడులు వీడే అవకాశం ఉంది. వీరి ఆచూకి లభ్యం కాకపోవడంతో దొరికిన నిందుతులు ఇస్తున్న సమచారం మేరకు కొత్త కొత్త పేర్లు ఈ కేసులో బయటకు వస్తున్నాయి. ఆమేరకు ఎఫఐఆర్ లో పేర్లు చేరుస్తున్నామని సీపీ అంజనీ కుమార్ అంటున్నారు. అఖిలప్రియ-భార్గవ్ రామ్ టార్గెట్ గా తెర వెనుక పాత్రలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు వీరిద్దరి గతం కూడా పలు ఆలోచనలు రేకెత్తిస్తోంది. అఖిలప్రియ – భార్గవ్ రామ్ కు ఇది రెండో వివాహం. పాత గొడవలు కానీ.. తొలి వివాహాల నేపథ్యంలో ఏమైనా తగాదాలు ఉన్నాయా..? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఏవీ సుబ్బారెడ్డి కీలకమేనా..?
ఈ కేసులో మరో ముఖ్యమైన వ్యక్తిగా ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు. మొదట ఏ1గా ఉన్న సుబ్బారెడ్డి రెండో రోజే ఏ2 అయ్యారు. ఆయనకు నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. అరెస్టు చేయలేదు. ఇందుకు కారణాలు కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా హఫీజ్ భూవివాదం.. కిడ్నాప్ కు దారి తీసింది. ఎవరి పాత్ర ఎంత ఉన్నా ముందు ఇరుక్కుపోయింది అఖిలప్రియ. బహుశా.. ఈ కేసు అత్యంత తీవ్రమైందని సోదరి మౌనికకు తెలియడం వల్లే ఆళ్లగడ్డ బాధ్యతలు నేను తీసుకుంటాను.. అభిమానులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు.. అని ముందే స్టేట్ మెంట్ ఇచ్చారా? అనే వాదనలూ లేకపోలేదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?