రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టులో సీబీఐ కీలక ఆరోపణలు చేసింది. వివేకా హత్య కేసులో నిందితుల్లో ఒకరైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంలో సీబీఐ తరపు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. నిందితుడు గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని వారిని రక్షించుకోవాలంటే ఆయన బెయిల్ రద్దు చేయాల్సిందేనని సుప్రీం కోర్టును కోరారు సీబీఐ తరపు న్యాయవాది. నిందితులు, రాష్ట్ర పోలీసులు కుమ్మక్కై విచారణ జరగకుండా చూస్తున్నారని సీబీఐ న్యాయవాది వాదనలు వినిపించారు.
సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం సమాధానం చెప్పాలంటూ ఎర్ర గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది సుప్రీం కోర్టు. తదుపరి విచారణను నవంబర్ 14 వ తేదికి వాయిదా వేసింది. ఇంతకు ముందు సీ బీ ఐ … ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఏపి హైకోర్టును ఆశ్రయించింది. సాక్షులను ప్రభావితం చేసినట్లుగా సరైన సాక్షాధాారాలను సీబీఐ నివేదించకపోవడంతో హైకోర్టు సీబీఐ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఘటనా స్థలంలో సాక్షాధారాలను రూపుమాపారు అన్న అభియోగంపై గతంలో ఎర్ర గంగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా, ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. సీబీఐ అరెస్టు చేసిన నిందితులకు మాత్రం బెయిల్ లభించలేదు. వారు ఇంకా జైలులోనే అండర్ ట్రైల్ ఖైదీలుగా ఉన్నారు.