ఏపిలో రాజధాని అంశంపై రగడ కొనసాగుతూనే ఉంది. అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని అ ప్రాంత రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తుండగా, వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు వారికి మద్దతు తెలియజేస్తున్నాయి. మరో పక్క ప్రభుత్వం తమ విధానం మూడు రాజధానులు అని స్పష్టం చేసింది. ఆ మేరకు మంత్రులు ప్రకటించడంతో పాటు విశాఖలో జరిగిన గర్ఝనకు సంపూర్ణ మద్జతు తెలియజేసింది. విశాఖను పరిపాలనా రాజధాని చేసి తీరుతామంటూ మంత్రులు ప్రకటిస్తున్నారు. మరో పక్క హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టు విచారణలో ఉంది. మరో పక్క హైకోర్టు తీర్పు అమలు చేయడం లేదంటూ రాజధాని రైతులు వేసిన పిటిషన్ హైకోర్టు విచారణలో ఉంది. ఈ తరుణంలో నేడు విజయవాడకు వచ్చిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమరావతి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతే రాజధాని అనే విషయంలో తమ పార్టీది ఏకాభిప్రాయమైన నిర్ణయమని స్పష్టం చేస్తూ ఇందులో కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు, ఇతరులవి విడివిడి అభిప్రాయాలు ఉండబోవని అన్నారు. ఏపికి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని మరో సారి స్పష్టం చేశారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన లో ఉద్రిక్తలు తలెత్తడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు ఉండకూడదని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు ఎవరి కార్యక్రమాలు వారు నిర్వహించుకోవాలని , వాటిని నిలువరింపజేయడం సరికాదని పేర్కొన్నారు. ఢిల్లీలో రైతులు ధర్నా చేసిన వారికి వసతులు కల్పించామని, రైతు సంఘాలతో ఒప్పందాలు చేసుకుని వారి సమస్య పరిష్కారానికి ప్రయత్నించామని తెలిపారు.
వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ఆరోపణలు.. నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి నోటీసు జారీ చేసిన సుప్రీం కోర్టు