ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురైంది. రాజధాని అమరావతి పిటిషన్లను త్వరతగతిన విచారణ జరపాలన్న ఏపి సర్కార్ కోరిక నెరవేరడం లేదు. వాయిదాల మీద వాయిదా పడుతుండటం ఏపి సర్కార్ కు ఇబ్బందికరంగా మారుతోంది. రాజధానిపై పిటిషన్లను త్వరగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం మరో సారి కోరింది. త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం ముందు ఏపి ప్రభుత్వం తరపున న్యాయవాదులు సోమవారం ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్పందించిన సుప్రీం ధర్మాసనం .. ఆ పిటిషన్ల పై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అమరావతి పిటిషన్లపై గత వారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్ లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేస్తూ సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ అదేశాల నేపథ్యంలో అప్పుడు వాయిదా పడింది.
పిటిషన్ల పై విచారణ తేదీ ప్రకటించకపోవడంతో ప్రభుత్వం తరపు న్యాయవాదులు సోమవారం జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు. మార్చి 7 హోళీ పండుగ తర్వాత వెంటనే విచారణ జరిపించాలని న్యాయవాదులు కోరినప్పటికీ మార్చి 28న విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. టాఫ్ ఆఫ్ ది బోర్డు గా తీసుకోవాలని కోరినప్పటికీ ఇప్పటికే రెండు మూడు కేసులు ఉన్నందున టాప్ ఆఫ్ ది బోర్డులో పెట్టలేమనీ కావున 28వ తేదీ విచారణ జాబితాలో ఉంచుతామని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ పిటిషన్లపై పలు వాయిదాలు జరుగుతూ వచ్చాయి. ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ ల సదస్సులో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ రాజదాని అవుతోందనీ, తాను కూడా త్వరలో షిప్ట్ అవుతాను, అక్కడి నుండే పరిపాలన సాగిస్తానని తెలియజేశారు. ఆ నేపథ్యంలో ఈ కేసు త్వరగా విచారణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి .. జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని బెంచ్ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ఈ నెల 23వ తేదీ విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. అయితే బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చినటువంటి అంశాలపై విచారణ జరపకూడదంటూ సీజే ఇచ్చిన సర్క్యులర్ నేపథ్యంలో గత 23వ తేదీ విచారణ జరగలేదు. దీనిపై ఎప్పుడు విచారణ జరుగుతుందో స్పష్టత లేకపోవడంతో దీనిపై స్పష్టత ఇవ్వాలని, త్వరితగతిన విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది కోరారు.
ఈ అంశంపై విచారణ జరిపి తీర్పు వెల్లడిస్తే వెంటనే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆ వెంటనే విశాఖకు రాజధాని షిప్ట్ చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తల్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా విచారణ జరగాలని కోరుకుంటుండగా, అంతకంతకు పిటిషన్ల పై విచారణ వాయిదా పడుతూ వస్తొంది. గత ఏడాది ఏపి హైకోర్టు .. రాజధానిగా అమరావతినే కొనసాగించాాలంటూ తీర్పు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పు వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్లకుండా ఆరు నెలల తర్వాత సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఆనాడు కూడా పిటిషన్ ను అత్యవసరంగా విచారణ జరిపి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా ఆ సమయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంత అత్యవసరం అయితే తీర్పు ఇచ్చిన ఆరు నెలల వరకూ ఎందుకు వేచి ఉన్నారంటూ ప్రశ్నించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో పలు అంశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలి.. ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య