గోదావరి నదికి వరద ఉదృతి అంతకంతకూ పెరుగుతోంది. దవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉదృతి గంట గంటకు పెరుతోంది. బ్యారేజీ వద్ద 19 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదులు తున్నారు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ రాత్రికి 20 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో లంక గ్రామాలు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నాయి.
వరద ప్రభావంతో కోనసీమ, ఉభయ గోదావరి. కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో దాదాపు 36 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత గ్రామాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యల్లో మొత్తం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్, పది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. 2020 సంవత్సరంలో ఈ స్థాయిలో గోదావరికి వరద వచ్చింది. అత్యధికంగా 1986లో 30 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి.
కాగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ వెంట హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఏరియల్ సర్వే అనంతరం సీఎం వైఎస్ జగన్ వరద సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్ లతో గోదావరి వరద ఉదృతి, సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.