Raghurama krishnaraju: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల ఎపిసోడ్లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ నెల 21 సుప్రీంకోర్టు ఎంపీ రఘురామకృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసినప్పటికీ ఇప్పటికీ ఆయన విడుదల కాని సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అన్నట్లుగా ఎంపీ రఘురామ విడుదల మరింత ఆలస్యం కానుంది.
సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా…
సుప్రీంకోర్టులో ఉత్కంఠ భరిత వాదనల తర్వాత బెయిల్ పొందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల ప్రక్రియలో ఇప్పటికే ఆలస్యం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజును తనయుడు భరత్, వ్యక్తిగత న్యాయవాది కలిసి ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం సాయంత్రం కల్లా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న సమయంలో ఓ ట్విస్టు జరిగింది.
రఘురామ బ్యాడ్ లక్..
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామకృష్ణరాజు ఆరోగ్య పరిస్థితిని సీఐడీ కోర్టు మెజిస్ట్రేట్ అడిగి తెలుసుకోవడంతో పాటుగా ఆస్పత్రి డిశ్చార్జి సమ్మరీ సమర్పించాలని కోరారు. అయితే, మరో నాలుగు రోజులు ఎంపీకి వైద్యం అవసరమని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు మెజిస్ట్రేట్ కి విన్నవించారు. దీంతో వైద్యులు తుది నివేదిక ఇచ్చిన తర్వాతే ఈ మేరకు నాలుగు రోజుల తర్వాత ఆర్మీ ఆసుపత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్ కానున్నారు.