Tirupathi RUIA: తిరుపతి రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మద్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నది. రూయా ఆసుపత్రిలో మృతుల సంఖ్య చాలా ఎక్కువేననీ, కానీ ప్రభుత్వం వాస్తవ విషయాలను కప్పిపెడతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రూయాలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్బంధాలు చేశారని టీడీపీ, సీపీఐ నాయకులు మండిపడుతున్నారు.
ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారని చెబుతున్న అధికారులు ఆ మృతుల వివరాలను కూడా ఇంత వరకూ వెల్లడించలేదని అంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ దుర్ఘనను ప్రతిపక్షాలు ప్రభుత్వానికి ఆపాదించి బుదరచల్లే ప్రయత్నం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఘటన జరిగిన సోమవారం రాత్రి ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారని అధికారికంగా వెల్లడించారు. అయితే సోమవారం జరిగిన సాధారణ మరణాలను కూడా ఆక్సిజన్ అందక మృతి చెందారని టీడీపీ వారు ఆరోపిస్తున్నాయని వైసీపీ మండిపడుతోంది.
Tirupathi RUIA: మరణాలపై గందరగోళం
కోవిడ్ మరణాలపై అధికారులే గందగోళానికి కారణం అవుతున్నారు. సోమవారం నాడు రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 45 మంది మృతి చెందినట్లు ఆ ఆసుపత్రి సూపర్నిటెండెంట్ ఓ జాబితా విడుదల చేశారు. అయితే అధికారులు మాత్రం ఆక్సిజన్ అందక మృతి చెందిన 11 మంది బాధితుల పేర్లు వెల్లడించలేదు. ప్రభుత్వం మాత్రం మృతి చెందిన ఆ 11 మందికి పది లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
మరో పక్క ఒక్క రూయా ఆసుపత్రిలోనే 45 మంది మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతుండగా ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ లో చిత్తూరు జిల్లాలో 24 గంటల వ్యవధిలో 18 మంది కరోనా బాధితులు మృతి చెందినట్లు పేర్కొనడంతో ప్రభుత్వం మరణాల లెక్కను దాస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ లెక్కలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి జాబితాను అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని బాధిత కుటుంబాలకు అందజేసి విమర్శలకు తావు రాకుండా చూసుకోవాలి.