Tirupati By Poll : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి పోటీకే అనర్హుడంటూ బీజేపీ ఏపి సహా ఇన్ చార్జి సునీల్ దేవధర్ పేర్కొన్నారు. ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ రాజకీయ పక్షాల మధ్య వేడివేడి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయిఈ నేపథ్యంలో తిరుపతిలో సునీల్ ధేవధర్ విలేఖరులతో మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థిపై ఆరోపణలు చేశారు. ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించదనీ, కావున ఎస్సీ రిజర్వుడు స్థానం అయిన తిరుపతి నుండి గురుమూర్తి పోటీకి అనర్హుడని పేర్కొన్నారు.
ఈ విషయంపై ఆయన అభ్యర్థిత్వం రద్దు చేయాలంటూ కోర్టుకు వెళతామనీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామనీ తెలిపారు. గురుమూర్తి నామినేషన్ వేయడానికి ముందు ఓ పాస్టర్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆ తరువాత తొలగించారని అన్నారు. గురుమూర్తి ఇప్పటి వరకూ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోలేదని తెలిపారు.
గురుమూర్తి మతం మారిన విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.తాను గోవింద నామాలు పెట్టుకుంటే మంత్రి పేర్ని నాని అవహేళన మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి నామాలు పెట్టుకోవడం నాటకాలుగా కనిపిస్తున్నాయా అని దేవధర్ ప్రశ్నించారు.