Top maoist leader RK: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) కన్నుమూశారు. అనారోగ్యంతోనే ఆర్కే కన్నుమూసినట్లు సమాచారం. చత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ అడవుల్లో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.నాలుగు దశాబ్దాలుగా మావోయిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆర్కే ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్నారు. ఆర్కే పై రూ.20లక్షల రివార్డు కూడా ఉంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో చనిపోయినట్లు చత్తీస్ గడ్ లోని బస్తర్ పోలీసులు చెబుతున్నారు. ఆర్కే మృతి మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయినట్లు అయ్యింది. మావోయిస్టు దళంలో వ్యూహాలను రచించడంలో ఆర్కే మంచి దిట్టగా పేరుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నారు ఆర్కే. అనేక పర్యాయాలు పోలీసుల ఎన్ కౌంటర్ ల నుండి తప్పించుకున్న ఆర్కే అనారోగ్యంతో మృతి చెందారు. ఆర్కే మరణ వార్తను పోలీసులు దృవీకరిస్తుండగా మవోయిస్టుల నుండి దృవీకరణ రాలేదు.
Top maoist leader RK: ఎదురు కాల్పుల్లో తప్పించుకుని అనారోగ్యంతో..
దేశ వ్యాప్తంగా ఆర్కేపై కేసులు ఉన్నాయి. అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి కేసులో నిందితుడుగా ఉన్నారు. 2018 లో ఏ వో బీ లోని బలిమెలలో జరిగిన ఎన్ కౌంటర్ నుండి ఆర్కే తృటిలో తప్పించుకోగా ఆ ఘటనలో ఆయనకు బుల్లెట్ గాయమైంది. ఆ ఘటనలో ఆర్కే కుమారుడు పృధ్వీ మృతి చెందాడు. ఉద్యమంలోనే శిరీష అలియాస్ పద్మ ను ఆర్కే వివాహం చేసుకున్నారు. తరువాత ఆమె జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె సొంత గ్రామం ప్రకాశం జిల్లాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పోలీసు కాల్పుల్లో చనిపోయే వారు కాకుండా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు ఎక్కువగా ఉన్నారు. కొంత మంది ముఖ్యనేతలు మృతి చెందినా వివరాలను మావోలు బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఆర్కే విషయంలోనూ మావోయిస్టులు గుంభనంగా ఉంటున్నారు.
పల్నాడు నుండి ప్రస్తానం
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మారుమూల గ్రామం తుమృకోటకు చెందిన ఉపాధ్యాయుడు అక్కిరాజు సచ్చిదానందరావు పెద్ద కుమారుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామ కృష్ణ (ఆర్కే). చిన్ తనం నుండే అభ్యుదయ భావాలతో పెరిగిన ఆర్కే .. మాచర్ల ఎస్ కే బీ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివే సమయంలోనే రాడికల్ ఉద్యమం వైపు ఆకర్షితులైయ్యారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో యాక్టివ్ గా పని చేసిన ఆర్కే ఆ తరువాత మావోయిస్టు పార్టీలో చేరి క్రియాశీలక భూమికను పోషించారు. అంచలంచెలుగా కేంద్ర కమిటీలో కీలక నేతగా ఎదిగారు.