TTD : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారికి దేశ విదేశాలలో లక్షలాది మంది భక్తులు ఉన్నారు. సామాన్యులు మొదలుకొని అపర కుబేరులు వారి వారి స్థాయికి అనుగుణంగా స్వామివారికి ప్రతి ఏటా విరాళాలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటుంటారు. సంపన్న వర్గ భక్తులు లక్షలు, కోట్లు విరాళంగా అందిస్తుంటారు. కొందరు శాశ్వత నిర్మాణాలకు విరాళాలను అందిస్తుండగా మరి కొందరు నిత్య అన్నదాన పథకం, ప్రసాదాల వితరణ, ఎస్ వీ బీసీ ట్రస్ట్ తదితరాలకు భారీగా విరాళాలను ఇస్తుంటారు. అయితే తాజాగా ముంబాయికి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త భారీ విరాళంతో చేపడుతున్న ప్రాజెక్టు శాశ్వతంగా ప్రజలకు సేవలు అందించేదిగా ఉండటంతో పాటు ఆ వ్యాపార వేత్త పేరు చిరస్థాయిగా నిలిచిపోనున్నది.
ముంబాయికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త సంజయ్ కే సింగ్ శ్రీవారికి భారీ విరాళాన్ని ప్రకటించారు. దాదాపు 300 కోట్ల రూపాయలతో 300 పడకల సూపర్ స్పెషాలిటీ చిన్న పిల్లల వైద్యశాల నిర్మించాలని తలపెట్టారు. దీనిపై టీటీడీతో ఒప్పందం చేసుకున్నారు. తిరుపతిలో 300 కోట్లతో ఆసుపత్రిని నిర్మించి టీటీడీకి అప్పగించనున్నారు సంజయ్ కే సింగ్. ఆయనకు చెందిన ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేటు లిమిటెడ్ (యూఐసీ) సంస్థ శుక్రవారం టీటీడీతో ఎంఓయు కుదుర్చుకున్నది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కే సింగ్, టీటీడీ అధికారులు ఒప్పంద పత్రాలు పరస్పరం మార్చుకున్నారు.