ACB: స్పందనలో వచ్చిన ఓ ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు స్పందించారు. అవినీతికి పాల్పడుతున్న ఓ పశువైద్యాధికారిని అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం నాడు వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ జిల్లా చాాపాడు మండలం వెదుకూరు గ్రామానికి చెందిన పోలగిరి సుబ్బారెడ్డి జెర్సీ ఆవు అనారోగ్యంతో గత నెల 28వ తేదీన మృతి చెందింది. దీనిపై బాధిత రైతు సుబ్బారెడ్డి సమాచారాన్ని పశువైద్యుడు డాక్టర్ మేసా లక్ష్మయ్యకు తెలియజేయగా ఆయన జెర్సీ ఆవుకు పోస్టుమార్టం చేశారు. ఆ తదుపరి “వైఎస్ఆర్ పశు నష్టపరిహార పథకం” కింద పశువైద్యాధికారికి ధరఖాస్తు చేశాడు సుబ్బారెడ్డి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ ధరఖాస్తు అప్ లోడ్ చేసేందుకు వైద్యుడు మేసా లక్ష్మయ్య రూ.3వేల లంచం అడిగారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధిత రైతు సుబ్బారెడ్డి స్పందనలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఏసీబీ అధికారులు స్పందించారు. ఏసీబీ డీఎస్పి పి కంజాక్షన్ తన సిబ్బందితో సోమవారం వెదుకూరు చేరుకున్నారు. బాధిత రైతు సుబ్బారెడ్డి నుండి డాక్టర్ మేసా లక్ష్మయ్య రూ.3వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్ పెక్టర్ కృష్ణమోహన్, సబ్ ఇన్స్ పెక్టర్ నరేష్ వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఏవరైనా లంచం అడిగితే నేరుగా తమకు గానీ స్పందన లో గానీ ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.