Vijaya sai reddy : రాష్ట్రంలో స్థానిక సమరం ప్రారంభం అయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులతో వైసీపీ చాలా బలంగా ఉంది. అయితే స్థానిక పోరు ఆ పార్టీ నేతలకు అగ్ని పరీక్షగా మారుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆ పార్టీ ముఖ్యనేత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన రాజకీయ చతురతను ఏ విధంగా ప్రదర్శిస్తారు అన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా ఉంది. పార్టీలో నెంబర్ 2 లాంటి స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు పెద్ద సవాల్ ఎదుర్కొంటున్నారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీ గెలుపును తన ఖాతాలో వేసుకున్న విజయసాయిరెడ్డి భుజస్తందాలపైనే ఇప్పుడు స్థానిక పంచాయితీల భారం ఉందని అంటున్నారు.
పరిపాలనా రాజధానిగా విశాఖను నిర్ణయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతను విజయసాయిరెడ్డిపై ఉంచారు. అయితే ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి పెత్తనాన్ని ఆ ప్రాంత సీనియర్ వైసీపీ నేతలు పలువురు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవల తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి, మాజీ మంత్రి కూడా విజయసాయిరెడ్డికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ జిల్లాల్లో వైసీపీ నేతలు ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉంటే విజయసాయి రెడ్డి వారందరినీ సమన్వయపర్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.
2019 ఎన్నికల నాటి ఫలితాలు ఇప్పుడు పునరావృత్తం కావాలంటే విజయసాయిరెడ్డి తన రాజకీయ చాణిక్యంతో విముఖంగా ఉన్న నేతలను సుముఖంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా రాజకీయాల్లో నేతలు విజయం సాధిస్తే అది తమ ఘనతగానూ ఓటమి చెందితే వారు చేయలేదు, వీరు చేయలేదు అంటూ సాకులు చెబుతూ ఉంటారు. కానీ ఇది సమిష్టి, సమైక్య విజయంగా చెప్పుకోరు. ఈ పరిస్థితిలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు సమిష్టి విజయం కోసం కృషి చేస్తారా లేక విజయసాయి రెడ్డికి హాండ్ ఇస్తారా అనేది తేలాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.