ఏపిలోని ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో మంకీ పాక్స్ కలకలం రేగింది. చిన్నారికి మాంకీ పాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానించారు. దుబాయి నుండి వచ్చిన ఓ కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్ అనుమానిత కేసుగా వైద్యులు భావించారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స చేస్తూ కుటుంబం మొత్తాన్ని అధికారులు ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉంచారు. చిన్నారి నమూనాలను సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. వైద్యులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే పుణె వైరాలజీ ల్యాబ్ నుండి వచ్చిన రిపోర్టులో మంకీ పాక్స్ నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. చిన్నారికి జరిపిన వైద్య పరీక్షలో మంకీపాక్స్ సోకలేదని నిర్ధారించారు. బాలికకు వచ్చింది సాధారణ దద్దుర్లేనని తెల్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చిన్నారికి చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఇప్పటికే మన దేశంలో మంకీ పాక్స్ మొదటి కేసు కేరళలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. వివిధ దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ కేసు ఒకటి కేరళలో వెలుగు చూడటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణీకులకు గైడ్ లైన్స్ జారీ చేసింది. కరోనా మహామ్మారి భయాన్ని ప్రజలు వీడకముందే మంకీ పాక్స్ ఆందోళన కల్గిస్తొంది. సాధారణ దద్దుర్లు కనబడినా ఆందోళన చెందుతున్నారు. కేరళలో మంకీ పాక్స్ సోకిన వ్యక్తి ఇతర దేశం నుండి వచ్చాడు. మంకీ పాక్స్ లక్షణాలు కనబడటంతో కేరళలోని వైద్యులు వెంటనే స్పందించి, అతని వద్ద నమనాలను సేకరించి పుణె లోని ల్యాబ్ కు పంపగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.