Power Bills: విద్యుత్ శాఖ అధికారుల లీలలు సామాన్య ప్రజానీకానికి ఓ పట్టాన అర్థం కావు. పూరి గుడిశకు వేలాది రూపాయలు బిల్లు చేతిలో పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది. సహజంగా కరెంటు వాడకానికి సంబంధించి మీటర్ రీడింగ్ ఆధారంగా లెక్క వేసి బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కరెంటు వాడుకోకపోతే మినిమమ్ బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సున్నా రీడింగ్ ఉన్న విద్యుత్ సర్వీసుకు ఏకంగా వెయ్యి రూపాయలకు పైగా బిల్లు రావడంతో ఆ వినియోగదాడు ఖంగు తిన్నాడు. ఇది కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగింది.
మచిలీపట్నం పరాసుపేటలోని సర్వీస్ నెంబర్ 62222405066396 వినియోగదారుడు అసలు విద్యుత్ వాడలేదు. బిల్లు మీద జీరో యూనిట్ లే ఉంది. కానీ బిల్లు మాత్రం రూ.1027 లు జనరేట్ అయ్యింది. ఇదే వినియోగదారుడికి గతంలో కూడా ఆరు నెలల నుండి అసలు విద్యుత్ వాడకపోయినా నెలకు రూ.300లు చొప్పున చెల్లించాడు. అయితే ఇప్పుడు ఏకంగా రూ.1027లు బిల్లు రావడంతో ఆ వినియోగదారులు అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తన బిల్లు సరిచేయాల్సిందిగా కోరుతున్నాడు.
విద్యుత్ మీటర్ రీడింగ్ వాస్తవానికి ప్రతి నెలా 30 రోజులకు ఒక సారి తీయాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో మీటర్ రీడింగ్ తీసే వారు రెండు మూడు రోజులు ఆలస్యంగా రీడింగ్ తీయడం వల్ల కూడా వినియోగదారులు నష్టపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక నెలలో ఒక యూనిట్ ఎక్కువగా వచ్చినా వందల్లో బిల్లు తేడా వచ్చే అవకాశాలు ఉంటున్నాయని వినియోగదారులు పేర్కొంటున్నారు. 0 నుండి 50 యూనిట్ లకు ఒక ధర, 51 నుండి 100 యూనిట్ లకు ఒక ధర, 100 నుండి 200ల యూనిట్ లకు మరో ధర ఇలా చార్జీలు వసూలు చేయడంతో స్లాబ్ సిస్టమ్ లో ఒక్క యూనిట్ పెరిగినా ఎక్కువ మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంది. రీడింగ్ తీయడంలో జాప్యం వల్ల నష్టపోతున్నామని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి మీటర్ రీడింగ్ లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, తప్పుడు బిల్లులు రాకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.