YCP: గ్రామాల్లో వీధి దీపం వెలగకపోయినా, మురుగునీరు పాలక పోయినా, రోడ్డు మీద చెత్త తొలగించకపోయినా, రోడ్డు అధ్వాన్నంగా ఉన్నా, తాగనీరు రాకపోయినా ప్రజలు నేరుగా ప్రశ్నించేది సర్పంచ్నే. గ్రామ పంచాయతీ సర్పంచ్ లు లేనప్పుడు సమస్యలపై గ్రామ పంచాయతీ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ను ప్రశ్నించే వాళ్లు. ఇప్పుడు గ్రామాలకు సర్పంచ్ లు ఉండటంతో ప్రజలు ఏ సమస్య ఉన్నా సర్పంచ్నే నిలదీస్తుంటారు. గ్రామాల్లో ఈ పనులు చేయాల్సిన బాధ్యత కూడా సర్పంచ్దే. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాకపోయినా కేంద్రం నుండి ఆర్ధిక సంఘం నిధులతో పనులు చేయిస్తుంటారు.
YCP: 13 మంది సర్పంచ్ లు వైసీపీకి రాజీనామా
అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ల అనుమతి లేకుండా ప్రభుత్వం 15 ఆర్ధిక సంఘం నిధులు లాగేసుకోవడంతో రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ లు పోరుబాటకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో సర్పంచ్ లు నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 13 మంది సర్పంచ్ లు వైసీపీ రాజీనామా చేశారు. ఇంతకు ముందు ప్రభుత్వం విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు అంటూ ఆర్ధిక సంఘం నిధులను తీసుకుంది. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలకు ఏ కారణం చెప్పకుండానే నిధులను తీసేసుకుంది ప్రభుత్వం.
పంచాయతీ విధులు బహిష్కరణ
కడప జిల్లా ఖాజీపేట మండలంలో 21 పంచాయతీలు ఉండగా 13 గ్రామాలకు చెందిన సర్పంచ్ లు ప్రత్యేకంగా సమావేశమై కీలక నిర్ణయాలను ప్రకటించార. తాము వైసీపీకి రాజీనామా చేస్తున్నామనీ, ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మత్తులు, శానిటేషన్ కార్యక్రమాలతో పాటు ఇతర పంచాయతీ విధి నిర్వహణ బాధ్యతలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ గ్రామాల సర్పంచ్ లు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. కడప జిల్లాలో మాదిరిగా ఇతర జిల్లాల్లోనూ గ్రామ పంచాయతీ సర్పంచ్ లు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దం అవుతున్నారు.