YS Jagan : మాట తప్పడు..మడమ తిప్పడు..ఏ విషయంలోనై మొండి పట్టుదలతో ముందుకు వెళతాడు, రాజీపడే మనస్థత్వం జగన్ ది కాదు ఈ విధమైన వైఖరితోనే వైఎస్ జగన్ మొదటి నుండి ఉన్నారు. ఆ తత్వమే 151 సీట్లతో జగన్ కు అధికారాన్ని తెచ్చిపెట్టింది. జగన్ ప్రదర్శిస్తున్న వైఖరి కారణంగానే మంచి గుర్తింపు వచ్చింది. అయితే జగన్ లో పట్టువిడుపు ధోరణిలో అసలు లేకపోవడం వల్లనే ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని వ్యవహారాల్లో ముందు చూపు అనేది లేకుండా మొండిగా వెల్లడం వల్లనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రధానంగా రాజ్యాంగ వ్యవస్థతో జగన్ వ్యవహరిస్తున్న తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. రాజకీయంగానూ ఇబ్బందులు కల్గిస్తున్నాయి.
జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలలో మొదటి నుండి కోర్టుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. దాదాపు 70కి పైగా ప్రభుత్వ నిర్ణయాలలలో కోర్టుల నుండి వ్యతిరేక తీర్పులు వచ్చాయి. ఈ విషయాలు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతుండగా తప్పు ఎక్కడ జరుగుతుందో వైసీపీ అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్లడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోంది. ప్రస్తుతం ఏపి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్నే తీసుకుంటే మొదటి సారే ఆయనను ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను పదవి నుండి తొలగించి ఆయన స్థానంలో కనగరాజ్ ను నియమించిన సమయంలో సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా నిమ్మగడ్డే విజయం సాధించారు. ఇప్పుడు ఎన్నికల విషయంలో చూసుకున్నా నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న ప్రతి సందర్భంలోనూ ప్రతిపక్షాలు విజయం సాధించామన్నట్లు వ్యవహరిస్తుండటం వంటివి వైసీపీ శ్రేణులను తీవ్ర అసహనాన్ని కల్గిస్తున్నాయి.
రాజ్యాంగ వ్యవస్థ జోలికి వెళ్లిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై సరైన వ్యూహాలు లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు. కీలక విషయాల్లో అయినా జగన్ ప్రభుత్వ సలహాదారులు, న్యాయనిపుణులు ప్రభుత్వ నిర్ణయాలపై ముందస్తు సమీక్షలు జరిపి ముందుకు వెళ్లకపోవడం వల్లనే నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా జగన్ రాజ్యాంగ వ్యవస్థలతో గానీ ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలోనైనా తగిన జాగ్రత్తలతో అడుగులు వేయకపోతే ఇలాంటి పరాభవాలు కొనసాగుతూనే ఉంటాయి.