YS Sharmila: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల ఈ క్రమంలో తన దూకుడు పెంచుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కోవిడ్ బ్రేకులు వేయడంతో ఆమె ఆన్లైన్ వేదికగా గులాబీ దళపతిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల కొత్త ట్రెండ్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. కరోనా కట్టడి విషయంలో కేబినెట్ సమావేశం అనంతరం లాక్డౌన్ నిర్ణయం ప్రకటించడంపై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ,ఈ విమర్శ రొటీన్ కు భిన్నంగా ఉండటం గమనార్హం.
ఆ లైన్ లో వెళ్తున్న షర్మిల
తెలంగాణలో ఆరోగ్య శ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడం , ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి సైతం రాకపోవడం పై షర్మిల ఫైరయ్యారు. “అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చడు. కేంద్ర ఆయుష్మాన్ భారత్ లో చేరరు“అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ దొర నిర్ణయాలన్నీ కార్పొరేట్ హాస్పటల్స్ కు దోచిపెడుతున్నాయని ఆమె ఆరోపించారు. కాగా బీజేపీ నేతలు సైతం ఇదే లైన్లో ఆరోపణలు చేస్తుండటం ఆసక్తికరం!
ఘాటు విమర్శలు…
ప్రభుత్వం నిర్వహిస్తున్న కోవిడ్ హాస్పిటల్స్ లో వసతులు ఉండట్లేదని షర్మిల మండిపడ్డారు “సర్కార్ దవాఖానా ఉన్నావా అంటే ఆ ఉన్నా అన్నట్లే ఉంది.. హైదరాబాద్ నాలుగు దిక్కులా దవాఖానాలు కడుతానన్న దానికి మోక్షం లేదు.. ప్రజల ఆరోగ్యానికి సరిపోను బడ్జెట్ ఇచ్చెదిలేదు.,ఉస్మానియా.. గాంధీ, నిమ్స్ .. టిమ్స్ ఆస్పత్రులకే ఊపిరి సక్కగా అందుతలేదు, ఇక అందులో చేరినవారి ఊపిరి గాలిలో దీపం..కార్పొరేట్ హాస్పిటల్స్ లో కరోనా వైద్యానికి .. రేటు ఎక్కువ, జనం కరోనా నుండి బతికి బయటపడితెే.. అప్పులతో చచ్చేటట్టుంది.. KCR సారు .. సోయిలకురా. ఇప్పటికైనా సర్కార్ దవాఖానాలను సక్కగ చేసి, కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చు“ అంటూ వైఎస్ షర్మిళ ఒకింత ఘాటుగా స్పందించారు.