YS Viveka Murder Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పురోగతి కనబడుతోంది. రెండు నెలలకు పైగా కడప, పులివెందులలో తిష్టవేసిన సీబీఐ అధికారులు అనుమానితులను విచారణ చేస్తూ కీలక విషయాలను రాబట్టారు. ఇప్పటికే వివేకాకు సన్నిహితంగా ఉండే వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసి జైలుకు పంపిన సీబీఐ అధికారులు తాజాగా మరో కీలక అనుమానితుడిని అరెస్టు చేశారు. వివేకాను ఎవరు హత్య చేశారు ? ఎవరు చేయించారు ? అని విషయాలపై సీీబీఐ లోతుగా విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలోనే హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడుగా భావిస్తున్న సింహాద్రిపురం మండలం కుంచేకుల గ్రామానికి చెందిన ఉమాశంకర్ రెడ్డి గురువారం ఉదయం నుండి విచారించిన సీబీఐ అధికారులు సాయంత్రం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆనంతరం అతన్ని పులివెందుల కోర్టులో హజరుపర్చారు. అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కీలక అనుమానితుడైన ఉమాశంకర్ రెడ్డి వివేకా పొలం పనులు చూసే జగదీశ్వర్ రెడ్డి సోదరుడు. ఉమా శంకర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక విషయాలను ప్రస్తావించింది. వివేకా హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ పాత్ర ఉంది అనడానికి కీలక అధారాలు ఉన్నాయని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో సీబీఐ పేర్కొంది. ఉమా శంకర్ పాత్ర ఉన్నట్లు సునీల్ కుమార్ యాదవ్, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి తమ వాగ్మూలాల్లో చెప్పారని తెలిపింది.
మరో కీలక విషయాన్ని కూడా సీబీఐ వెల్లడించింది. వివేకా హత్యకు ముందు సునీల్, ఉమాశంకర్ లు ఆయన ఇంట్లోని శునకాన్ని కారుతో ఢీకొట్టి చంపారని పేర్కొన్నారు. వివేకాను హత్య చేసేందుకు వీరు ఇద్దరూ కలిసి బైక్ పై వెళ్లారనీ, హత్య జరిగిన తరువాత ఉమా శంకర్ తన బైక్ లో గొడ్డలి పెట్టుకుని పారిపోయారని సీబీఐ అధికారులు వివరించారు. బైక్ ను, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. గుజరాత్ నుండి పొరెన్సిక్ నివేదిక కూడా తెప్పించామనీ సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది. గత నెల 11వ తేదీన ఉమా శంకర్ ఇంటి నుండి రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన సీబీఐ మరి కొన్ని ఆధారాలను, ఆయుధాయులను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని కోర్టుకు తెలియజేస్తూ ఉమాశంకర్ ను అయిదు రోజుల కస్టడీయల్ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే కోర్టు ఉమాశంకర్ కు ఈ నెల 23 వరకూ రిమాండ్ విధించడంతో కడప జైలుకు తరలించారు.