YSRCP: రేపు ఉదయం ఏపి నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై సీఎం వైఎస్ జగన్ చివరి కసరత్తు చేస్తున్నారు. మరి కొద్ది సేపటిలో కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ ఆమోదం కొరకు రాజ్ భవన్ కు సీల్డ్ కవర్ లో పంపనున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారుల భేటీ అయ్యారు. ఇదే క్రమంలో తమ నాయకుడికి మంత్రి పదవి వరించాలని చాలా నియోజకవర్గాల్లో కీలక నేతల అభిమానులు, వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. వైసీపీలో దాదాపు 50 మందికిపైగా మంత్రి పదవులను ఆశిస్తుండగా కొత్తగా 15 మందికే అవకాశం కల్పించే పరిస్థితి నెలకొంది. సీనియర్ మంత్రుల అసంతృప్తి, ఆగ్రహాం, వత్తిళ్ల నేపథ్యంలో అయిదుగురిని, సామాజిక సమీకరణల నేపథ్యంలో మరో అయిదుగురిని ఇలా మొత్తం పది మందికి పాత వారికి మరో సారి అవకాశం ఇస్తున్నారు. ఈ కారణంగా కొత్తగా 14 నుండి 15 మందికే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. రెడ్డి సామాజికవర్గంలో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ముగ్గురు, నలుగురికి మించి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం లేదు.
YSRCP: పిన్నెల్లి కి మద్దతుగా ప్రజా ప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలు..?
ఈ తరుణంలో వైసీపీలో కొత్త తలనొప్పులు బయలుదేరాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా ప్రజా ప్రతినిధులు సమావేశమైయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్ లు సమావేశమైయ్యారు. పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ కూడా పేర్కొన్నారు. మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిషోర్, కారంపూడి సొసైటీ చైర్మన్ కొమ్మిరెడ్డి నల్లగురువారెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో కొత్త మంత్రుల లిస్ట్ ఇది అంటూ జరుగుతున్న ప్రచారంలో కొందరు ఆశావహుల పేర్లు లేకపోవడంతో వారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో సీనియర్ ఎమ్మెల్యేలను కాదని జూనియర్ లకు అవకాశం కల్పిస్తుండటంతో ఆ నాయకుల అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో 2009 లో ఎమ్మెల్యే గా ఎన్నికైయ్యారు. ఆ తరువాత వైసీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో కొనసాగుతూ 2012, 2014,2019 ఎన్నికల్లో వరసుగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయనకు మంత్రి వర్గంలో స్థానం లేదన్నట్లుగా వార్తలు రావడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
YSRCP: హైబీపీతో అస్వస్థతకు గురైన బాలినేని
మరో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన మంత్రిపదవిని రెన్యువల్ చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నిన్నటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అపాయింట్ మెంట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ జిల్లా నుండి ఆదిమూలపు సురేష్ ను మంత్రి వర్గంలో కొనసాగిస్తూ తనను తప్పించడంపై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లభించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలినేని నిన్నటి నుండి భోజనం కూడా చేయలేదని తెలిసింది. దీంతో ఆయనకు హైబీపీ రావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారని సమాచారం.