KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రాష్ట్ర ఉద్యోగుల పై వరాల జల్లు కురిపించారు. అయితే రాజకీయ నేతలు ఏమి చేసినా ఊరికనే చేయరే అనే సందేహం అందరి మదిలో మెదులుతుంది. ఏ రకంగా తమకు లబ్ది లేకుండా ఏ నేత అయినా కూడా ఏమి చేయడు అనేది జనాల నరనరాల్లో ఇంకిపోయిన భావన. కాబట్టి నాయకులు స్పందించారు అంటే సొంత లాభం కొంత మానుకున్నారు అనే రకంగా ఎవరూ ఆలోచించరు.
అలాంటిది మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా వరాల వర్షం కురిపించారు అంటే ఆ అనుమానాలు తారా స్థాయికి చేరుకోకుండా ఉంటాయా? కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడే ఉద్యోగ వర్గాల ఎన్ని డిమాండ్ చేసిన పట్టించుకోని కేసీఆర్…. ఆర్టీసీ ఉద్యోగుల తో కయ్యానికి కాలు దువ్విన కేసీఆర్… ఇప్పుడు అనూహ్యంగా ఇంత మార్పు చెందడం వలన కథాకమామీషు ఏమిటి అన్నది తెలియక చాలా మంది తలలు గోక్కుంటున్నారు.
30% ఫిట్మెంట్ పెంచారు. ఇది ఏప్రిల్ 1 నుండే అమలులోకి వస్తుందని ప్రకటించేశారు. ఈ పిఆర్సి తో 9 లక్షల 15 వేల 797 మంది ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు. అలాగే రిటైర్మెంట్ పరిమితిని 61 ఏళ్ళ కి పెంచారు. అసలు ప్రతి ఒక్క ఉద్యోగుల సంఘానికి మేలు అయితే చేసేశారు. ఇక దీనికి కారణంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రకి ఎంత ఇచ్చినా తక్కువ అని… అందుకే అన్ని ఉద్యోగాలకు పిఆర్సి వర్తిస్తుందని కూడా చెప్పేశారు.
ఇదంతా మానవీయ కోణంలో జరుగుతుందని చెబుతున్నప్పటికీ…. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలోనే ఈ వ్యూహాత్మక ధోరణి అని పలువురు అంటున్నారు. దుబ్బాక షాక్, గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు చేజారడం తర్వాత రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోంది కాబట్టి ఇది చెక్ మేట్ అంటున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించాలి అంటే ఇలాంటి కీలక నిర్ణయాలు తప్పవని కేసీఆర్ భావించినట్లు వేశ్లేషిస్తున్నారు. మరి ఈ విశ్లేషణలు అన్నీ ఇప్పుడు కెసిఆర్ పై ఇలా వార్తల్లా వస్తుంటే దానికి ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో ఉపఎన్నిక ఫలితాలు చూస్తే తెలుస్తుంది