Karnataka CM: కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్ప మార్పు అంశం చాలా కాలంగా వార్తల్లో ఉన్నప్పటికీ ఆ వార్తలను ఆయన తొసిపుచ్చుతూ వచ్చారు. యడియూరప్ప వ్యతిరేక వర్గీయులు కేంద్ర నాయకత్వం వద్ద చక్రం తిప్పడంతో చివరకు యడియూరప్ప రాజీనామా చేయకతప్పలేదు. అయితే కర్ణాటకలో యడియూరప్ప మార్పునకు ముందు జరిగిన పలు ట్విస్ట్ లు, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కర్ణాకట జనాభాలో లింగాయత్ వర్గానికి చెందిన వారు 18 నుండి 20 శాతం మంది వరకూ ఉంటారు. లింగాయత్ అనేది ఒక కులం కాగా దీన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. లింగాయత్ లలో 80 శాతం మందికిపైగా బీజేపీకి అనుకూలంగా ఉంటుంటారు. కర్ణాటకలో బీజేపీ గెలుపునకు ఈ కులానికి చెందిన ప్రదాన భూమికను పోషిస్తుంటారు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి బలం లేనప్పటికీ కర్ణాటకలో వీరి ప్రాబల్యం కారణంగా బీజేపీ గెటాన్ అవుతోంది. దాదాపు 50 నుండి 60 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో లింగాయత్ లు ఉన్నట్లు సమాచారం.
Karnataka CM: లింగాయత్ లదే రాజ్యం..!! అందుకే
లింగాయత్ లలో ఎక్కువ మంది మఠాధిపతులుగా మారారు. అందు వల్లనే దేశం మొత్తంలో ఎక్కువ మఠాలు ఉన్నది కర్ణాటకలోనే అన్నది మన అందరికీ తెలిసిన విషయమే. మఠాలను నిర్వహిస్తున్న లింగాయత్ లు తమది ప్రత్యేక మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. లింగాయత్ వర్గానికి చెందిన యడియూరప్ప కర్ణాటక కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ ఏనాడూ పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేదు. 2018 లోనూ యడియూరప్ప ప్రజల చేత ముఖ్యమంత్రి గా ఎన్నిక కాలేదు. 2018 ఎన్నికల్లో కర్ణాటకలో పూర్తి స్థాయి మెజార్టీ స్థానాలు బీజేపీ సాధించలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే నిలిచింది. జెడిఎస్, జేడియు కూటమిగా కుమారస్వామి ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అధికార పార్టీ నుండి 16 మంది ఎమ్మెల్యేలను బీజేపిలో చేర్చుకుని వారితో రాజీనామాలు చేయించడం, ఆ తరువాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తదువరి రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఢిల్లీ రాజకీయాలు, ఏపి రాజకీయాలకు భిన్నంగా వెన్నుపోటు రాజకీయాలు కర్ణాటకలో స్పష్టంగా కనబడుతుంటాయి.
యడ్డీ అవినీతి మూల కారణం..! కానీ
ఇకపోతే గత యడియూరప్ప గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రగా చేసినప్పటికీ ఈ టర్మ్ లోనే ఆయన ఎక్కువగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. వందల కోట్ల డీల్స్ లో, ఐఎఎస్ ల బదిలీలలో యడియూరప్ప తనయుడు పేరు ప్రముఖంగా వినబడటంతో ప్రతిపక్షాల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. యడియూరప్ప వ్యవహార శైలి పై స్వపక్షంలోనూ అసంతృప్తి పెరిగిపోయింది. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లగా యడియూరప్పపై అసంతృప్తితో ఉంది. అయితే కర్ణాటకలోని 400 మందికి పైగా మఠాధిపతులు మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ యడియూరప్ప పాలనను కీర్తించారు. యడియూరప్పనే సీఎంగా కొనసాగించాలంటూ కూడా వారు మాట్లాడటం గమనార్హం. అయితే యడియూరప్పను కొనసాగిస్తే రాష్ట్రంలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని భావించిన బీజేపీ అధిష్టానం సీఎం మార్పునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. చివరకు అధిష్టానం ఆదేశాలతో పదవిని వదిలిన యడియూరప్ప రాజీనామా లేఖ ఇచ్చిన తరువాత మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైయ్యారు. ఆ సమయంలో ఓ మఠాధిపతి యడియూరప్ప నుండి మైక్ తీసుకుని ఇక దేశంలో, రాష్ట్రంలో బీజేపీ నాశనం అయిపోతుందంటూ శాపనార్ధాలు పెట్టడం ప్రస్తావనార్హం. సో..ఇక్కడ చూసుకున్నట్లయితే వారికి పార్టీ కంటే కులం, మతం, ప్రాంతమే ముఖ్యంగా కనబడుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా లింగాయత్ ల నుండి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మైని సీఎంగా ఎంపిక చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లింగాయత్ లకు కాకుండా వేరే వారిని సీఎంగా ఎంపిక చేస్తే లింగాయత్ ల నుండి తీవ్ర తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. దాంతో బీజేపీ తీవ్రంగా నష్టపడే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని గమనించిన బీజేపీ అధిష్టానం ఈ దిశగా చర్యలు తీసుకుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.