YS Viveka Case: ఏపీలో సంచలన కేసుగా.. దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కేసు వైఎస్ వివేకా హత్య కేసు..! ఈ కేసు దర్యాప్తుని సీబీఐ దాదాపు 13 నెలల కిందటే ఆరంభించింది. ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది. అయితే ఈ 13 నెలల సీబీఐ విచారణలో ఎన్నో ట్విస్టులు, ఎన్నో ఉదంతాలు, ఎన్నో మలుపులు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి..! ఈ హత్య కేసును ఛేదించే విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటి వరకూ మూడు పర్యాయాలు కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో పది రోజులు, పదిహేను రోజులు మాత్రమే విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఈ సారి 50 రోజులకుపైగా కడపలోనే తిష్టవేసి విస్తృతంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కీలక ఆధారాలు కొన్ని సేకరించినట్లు తెలుస్తోంది.
YS Viveka Case: వివిధ మార్గాల్లో అనుమానితుల గుర్తింపు..!
సీబీఐ విచారణను ఎవరూ ప్రశ్నించకుండా, రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా ఎవరైతే అనుమానితులు ఉన్నారో, ఎవరైతే ఆ హత్య కేసులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలు పంచుకున్నారని భావిస్తున్న వారిని కఠిన ధోరణిలోనే విచారణ చేసినట్లు సమాచారం. వివేకా హత్య కేసులోతొలి నుండి ప్రధాన అనుమానితులుగా, ప్రధాన సాక్షులుగా అయిదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, నైట్ వాచ్ మెన్ రంగన్న అలియాస్ రంగయ్య, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా వీరితో పాటు స్థానిక వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ లు ఉండగా వీరిని సీబీఐ అధికారులు సీరియస్ గా విచారణ చేశారు. వీరిలో ఎర్ర గంగిరెడ్డిని దాదాపు 40 రోజుల పాటు విచారణ చేశారు.
కీలక దశలో థర్డ్ డిగ్రీ..!!
కేసు విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అధికారులు జమ్మలముడగు మెజిస్ట్రేట్ ముందు హజరు పర్చి 164 కింద సాక్షిగా వాగ్మూలాన్ని రికార్డు చేయడం జరిగింది. ఇది తీవ్ర సంచలనానికి దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసులో సీబీఐ అధికారుల అనుమానితుల జాబితాలో ఉన్న సునీల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా హైకోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తనను ఈ కేసులో సీబీఐ అధికారులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనీ, గతంలో తనను విచారణ పేరుతో ఢిల్లీకి తీసుకువెళ్లిన సీబీఐ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనీ, లైడిటెక్టర్ తో పరీక్షలు చేశారనీ, ఆ సమయంలో ఖాళీ కాగితాలపై సంతకాలు కూడా తీసుకున్నారనీ సునీల్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో సునీల్ కుమార్ పేర్కొన్నాడు. ఈ కేసులో ప్రతివాదిగా సీబీఐ డైరెక్టర్ ను చేర్చి తనకు ఈ కేసులో ఇరికించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ వేడుకున్నారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకే వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న క్రమంలో సునీల్ కుమార్ యాదవ్ పిటిషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరిస్తుందా, ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది ఇప్పుడు ఆశక్తికరంగా మారింది.
అయితే ఇటీవల కాలంలో అనుమానితుల్లో కొత్త కొత్త పేర్లు రావడంతో కేసు విచారణపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వైఎస్ సునీత, సౌభాగ్యమ్మ, వైఎస్ కుటుంబ సభ్యులతో సీబీఐ అధికారులు ఇటీవల భేటీ అయన సందర్భంలో మరి కొన్ని అనుమానితుల పేర్లు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కడపలో ఓ ఆసుపత్రి యజమాని, పులివెందులలో వైఎస్ వివేకా మరణానికి ముందు కారులో వచ్చి వెళ్లిన వారి పేర్లు, రిక్కీ నిర్వహణకు వాహనాలు అద్దెకు ఇచ్చిన వారి పేర్లు కూడా సీబీఐకి ఇచ్చారని తెలుస్తోంది. దీంతో అనుమానితుల జాబితా పెరుగుతోంది. సీబీఐ విచారణ చేయాల్సిన వారి సంఖ్య పెరుగుతోంది.