తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ మిత్రులు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో జల వివాదం లో వారిద్దరూ ఒకరి మీద ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్నారు అని కూడా ఐడియా ఉండే ఉంటుంది.
మరి ఈ వ్యవహారం ఎక్కడ దాకా వచ్చింది…? భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీయవచ్చు అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం.
జగన్ ఇగో ఆల్రెడీ హర్ట్ అయిపోయింది
ఇప్పుడు ఈ నెల 5వ తేదీన జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ కేంద్రం భేటీ ని ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో జరిగనున్న ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ తప్పనిసరిగా హాజరు కావాలని కేంద్రం నుండి స్పష్టమైన సమాచారం వచ్చింది. వారిద్దరు హాజరు అయితేనే అపెక్స్ కౌన్సిల్ జరుగుతుంది. ఒక్కరు హాజరు కాకపోయినా వాయిదా పడుతుంది. జగన్ మోహన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధం అయ్యారు. కానీ కేసీఆర్ మాత్రం దానికి దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. ఒక పక్క జగన్…. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అధికారుల వద్ద సేకరించి అధ్యయనం చేస్తూ ఉంటే కేసీఆర్ మాత్రం అదే రోజున కావాలని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది జగన్ కు కచ్చితంగా చిర్రెత్తుకొచ్చే అంశమే.
మొత్తానికి జగన్ సరైన పాయింట్ పట్టాడు
ఇక అపెక్స్ కౌన్సిల్ భేటీకి డుమ్మా కొట్టిన కేసీఆర్ ఆ కమిటీ ని వాయిదా వేయాలని కోరినట్లు అధికారులు జగన్ కు వివరించారు. అయితే జగన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ భేటీ జరగాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే అన్ని విధాలుగా కేసీఆర్ సిద్ధం కావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెసిఆర్… ఇలా తనకు మరియు అపెక్స్ కౌన్సిల్ ఎటువంటి గౌరవం చూపించకపోవడం పై జగన్ ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ వర్గాల లో టాక్ నడుస్తుంది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు నుండి 800 అడుగుల నుంచి నీరు తీసుకోవాలని జగన్ పట్టుదలతో ఉన్నారు.
ప్రస్తుతం శ్రీశైలం లో నీరు 854 అడుగులకు చేరితేనే పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ వారు నీరు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే తెలంగాణ మాత్రం 800 అడుగుల నుంచి నీరు తీసుకుంటుంది. అలాగే శ్రీశైలం లోకి వచ్చిన నీటిని ఇష్టం వచ్చినట్లు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వాడేసుకుంటూ ఉంది. ఇక తెలంగాణ ఇలా నీటిని వాడుకుంటున్నప్పుడు తాము మరో యాభై అడుగులు తవ్వుకుని ఎందుకు వాడకూడదు అన్నది జగన్ ఆలోచన. అపెక్స్ కమిటీలో దీనినే ప్రస్తావించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు పొందాలని భావిస్తున్నారు.
ఎటు పోయినా సమరమే..!
ఇక జగన్ వ్యూహం గమనించిన కేసీఆర్ తాను కూడా ఈ విషయంలో పూర్తిగా సన్నద్ధం అయ్యేందుకు సమయం కోసం భేటీని వాయిదా వేయవలసిందిగా కోరినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ కేసీఆర్ కు సమయం ఇచ్చే అవకాశమే లేదు.
అసలే ఇద్దరు నాయకులు ఎవరినీ ఎక్కడ లెక్కచేయరు. వీరి మధ్య ఉన్న మిత్రుత్వం సగం చెడింది. ఇప్పటికే ఈ విషయంలో కేసీఆర్ పంతానికి పోయి భేటీ కి డుమ్మా కొట్టేస్తే…. జగన్ ఇదేమిటని ఆగ్రహంతో ఊగిపోయే అవకాశం ఉంది.అప్పుడు జగన్ నేరుగా కెసిఆర్ పై విమర్శలు చేయకపోయినా… అపెక్స్ కౌన్సిల్ లో తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వం నుండి కేసీఆర్ పై వెల్లువెత్తుతాయి. సరే తెలంగాణ ముఖ్యమంత్రి పూర్తిగా సన్నద్ధం కాకుండా భేటీకి వెళ్లారంటే మాత్రం జగన్ లేవనెత్తే పాయింట్లకు కేసీఅర్ తనదైనశైలిలో జవాబు చెబితే చివరికి జరిగేది రణరంగమే. మరి దీనిని నివారించే మార్గం ఏమిటో ప్రస్తుతానికైతే ఎవరికీ తెలియదు.