Corporate Colleges: కార్పొరేట్ కాలేజీ Corporate Colleges కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్ధుల సక్సెస్ కంటే.. ఆయా కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధుల అంశాలే ప్రముఖంగా వార్తల్లో నిలుస్తూంటాయి. ప్రతి ఏటా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల్లో ఎక్కడోచోట ఇటువంటి ఘటనలు లేకుండా ఆ విద్యా సంవత్సరం ముగిసింది అనుకోవడం భ్రమే. అటువంటి దారుణమైన ఘటనే ఇప్పుడు చైతన్య కాలేజీలో జరిగింది. అనంతపురంకు చెందిన ఇంటర్ చదివే విద్యార్ధిని విజయవాడలోని పునాదిపాడు క్యాంపస్ లో బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోరంకిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా విద్యార్ధిని అప్పటికే మృతి చెందింది. అయితే..
మనసులోని బాధను బయటకు చెప్పుకోలేక పోయిందో.. ఏమో జీవితాన్ని అర్ధాంతరంగా చాలించింది. హృదయవిదారకమైన ఈ ఘటనపై ఎందుకు వ్యవస్థ స్తబ్దుగా ఉండిపోయింది? అంటే సమాధానం లేని ప్రశ్నే ఎదురవుతోంది. చదువే భారమైందా? ఇంటి బెంగే కారణమా? హాస్టల్ లో ఇమడలేకపోయిందా? కాలేజీ నిర్లక్ష్యమా?.. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాత్రం ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని అన్నారు. విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్త ఎందుకు ప్రముఖంగా వెలుగులోకి రాలేదో అంతుబట్టని ప్రశ్నగా మిగిలింది. రాజకీయ పార్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే మీడియాకు ఓ విద్యార్ధిని మృతి ఎందుకు పట్టలేదనేది ప్రశ్న?
ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు విపక్షాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాయి. కాలేజీ యాజమాన్యాలపై మండిపడతాయి. ప్రైవేటు కాలేజీల దాష్టికాలు.. అంటూ రోడ్డెక్కి విద్యార్ధుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని పోరాడతాయి. ప్రభుత్వం ప్రైవేటు కాలేజీలపై కఠినంగా వ్యవహరించడం లేదని విమర్శిస్తాయి. విద్యార్ధి సంఘాలు అంతకు మించి ప్రతిఘటిస్తాయి. టీడీపీ హయాం నడుస్తున్నప్పుడు కూడా టీఎన్ఎస్ఎఫ్ ప్రేవేట్ కాలేజీలకు వెళ్లి విద్యార్ధులకు కౌన్సెలింగ్ లు ఇచ్చారు. ఇతర స్టూడెంట్ యూనియన్లు మరింత రచ్చ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా.. కనీసం పోరాడి వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చేవి. మరి.. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు, మీడియా, విద్యార్ధి సంఘాల మౌనం దేనికో.. విద్యార్ధిని మృతి కంటే అంతుబట్టిన మిస్టరీ అయింది..!