YS Sharmila : వైయస్ షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టినప్పటి నుండి తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఖమ్మం జిల్లాలోని ఒక కీలకమైన నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల ఇప్పుడు ఖమ్మం హెడ్ క్వాటర్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. ఏప్రిల్ 9వ తేదీన దీనిని భారీ స్థాయిలో నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఈ బహిరంగ సభ జరగాలని…. ఇక్కడి నుండి తన రాజకీయ ప్రచారాన్ని మరింత ఘనంగా ముందుకు తీసుకెళ్లాలని ఆమె అనుకుంటున్నారు.
కనీసం లక్ష మందికి తక్కువ లేకుండా జనం హాజరయ్యే ఏర్పాట్లు కూడా జరగాలని తన మద్దతుదారులకు ఆమె గట్టిగానే సందేశం పంపారు. అయితే తెలంగాణలో ఇప్పుడు ఒక్కసారిగా కరోనా వైరస్ ఊపందుకుంది. రోజుకి ఐదు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 14 మంది చనిపోయారు. ఒక్కసారిగా వందలాది కరోనా కేసులు వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే విద్యాసంస్థలన్నింటినీ తెలంగాణలో మూసివేశారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా తయారయ్యే అవకాశం ఉంది.
ఇక లాక్ డౌన్ మాత్రం విధించే పరిస్థితి లేదని ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది. థియేటర్లు కూడా అలాగే కొనసాగుతాయి కానీ ఇటువంటి భారీ బహిరంగ సభకు మాత్రం పర్మిషన్ దొరక్కపోవచ్చు. అసీ కాకుండా నైట్ కర్ఫ్యూ విధించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పుడు ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహణకు ఇదే షర్మిలకు అడ్డుపడవచ్చు అని కొంతమంది అంటున్నారు.
కరోనా వైరస్ ప్రమాదం పెరిగితే మాత్రం బహిరంగ సభకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతులు ఇచ్చే అవకాశం ఉండదని… ఇచ్చిన వాటిని రద్దు చేస్తారు అని చెప్పవచ్చు. ఇప్పటికే బహిరంగ సభకు లోటస్పాండ్ వర్గాలు అనుమతులు కోరారు. గ్రౌండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి అయితే అనుమతులు ఇచ్చారు కానీ పోలీసులు మాత్రం ఈ నేపథ్యంలో షరతులు విధించారు.మాస్క్ లు, శానిటైజర్లు తప్పనిసరి అని చెప్పారు. కానీ అన్నీ అధికారుల నుండి అనుమతులు రావడం మాత్రం కష్టమే.