మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో వేలాది మెగా ఫ్యాన్స్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. జనసేనాని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొనగా.. అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్, డా.కె.వెంకటేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు, రాపాక వరప్రసాద్, అమెరికా ఎన్నారై.. మెగా బ్లడ్ డ్రైవ్ నిర్వాహకుడు నటరాజ్,సురేష్ కొండేటి, కాసర్ల శ్యామ్, గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ-“నేను మీలో ఒకడిగా వచ్చాను ఇక్కడికి. నాకు జీవితంలో స్ఫూర్తి ప్రదాత అన్నయ్య చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. ఇది చాలా ప్రత్యేకమైన సంవత్సరం. ప్రత్యేకమైన సందర్భమిది. అన్నయ్య అభిమానిగా అన్నయ్యను ఎలా చూడాలని ఉవ్విళ్లూరానో అలాంటి సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దేశం కోసం మన నేల కోసం ఎంతో త్యాగం చేసిన సమరయోధుడి జీవితాన్ని సినిమాగా తీయడం.. విభిన్నమైన కళాకారులు వేరే భాషల నుంచి వచ్చిన వారు ఇందులో నటించారు. నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు అన్నయ్య అయితే.. ఇంకొకరు అమితాబ్ బచ్చన్. వీళ్లిద్దరూ నాకు జీవితంలో బలమైన స్ఫూర్తి ప్రదాతలు. అన్నయ్యను చూడటానికి వెళ్లినప్పుడు అమితాబ్ గారిని కలిసే అరుదైన అవకాశం ఈ సినిమా షూటింగ్ లో లభించింది.
కర్నూలు – రేనాడు (రాయలసీమ నదీపరీవాహక ప్రాంతం) కథతో తెరకెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకి గొంతు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాని యాథృచ్ఛికంగా తీయలేదు. కర్నూలు- నందికొట్కూరు కొణిదెల గ్రామం అని సినిమా చేసేప్పుడు తెలిసింది. ఇది తెచ్చుకుంది కాదు.. వెతుక్కుంటూ వచ్చిన సినిమా ఇది. అన్నయ్యను టైటిల్ పాత్రధారిని చేసింది. ఎవరినో నిర్మాతలుగా పెట్టుకోలేదు. కొణిదెల ఇంటి పేరు పెట్టుకున్న రామ్ చరణ్ నిర్మాత అయ్యారు. ఒక తమ్ముడిగా నేను ఇలాంటి సినిమా చేయలేకపోయాను. ఇలాంటి గొప్ప సినిమా తీసే సమర్థత నాకు లేకపోయింది. నా తమ్ముడి లాంటి రామ్ చరణ్ .. 150వ సినిమా చేశాడు. ఇలాంటి సినిమా చేస్తే చిరంజీవి గారే చేయాలి అనేంతగా సైరా చిత్రాన్ని ఇప్పుడు తీస్తున్నారు. ఇలాంటి చిత్రం రామ్ చరణే చేయాలి. ఎన్ని కోట్లు అయినా .. డబ్బు వస్తుందా లేదా? అన్నది చూడకుండా బలమైన సినిమా తీయాలని అనుకున్నారు. దర్శకులు సురేందర్ రెడ్డిగారి కల ఇది. ఆయన కలను సాకారం చేసుకున్నారు. ఆయన గతంలో చేసిన సినిమాలన్నీ నాకు నచ్చినవి. అలాంటి వ్యక్తి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా మనందరి అభిమాన స్టార్ చిరంజీవి గారు నటించిన చక్కని చిత్రమిది. మన దేశ చరిత్రను ఎవరో రాస్తే దాని గురించి మాట్లాడతాం. భారతదేశం మర్చిపోయినా మన తెలుగు వాళ్లం మర్చిపోలేదు. మన కొణిదెల వంశం మర్చిపోలేదు. దేశం కోసం ఎంతో మంది చనిపోయారు. దేశం గుర్తించని ఉయ్యాలవాడ చరిత్రను కొణిదెల సంస్థ గుర్తించింది. ఇది గర్వకారణం. కొణిదెల నామధేయాన్ని సార్థకం చేసుకున్నారు. నేను ఇందులో నటించలేకపోయాను. కానీ గొంతు వినిపించాను. `సైరా-నరసింహారెడ్డి` అని అనగలిగానంటే నా గుండె లోతుల్లోంచి అభిమాని గా వచ్చినది. అన్నా నువ్వు కొట్టగలవు. అన్నా నీకు బానిసలం.. మేం.. ఈ చిత్రానికి దర్శకనిర్మాతలు.. రచయితలు .. నా తల్లి వంటి వదిన గారికి చిత్రంలో నటించిన నటీనటులందరికీ .. ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను“ అని అన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!