టీవీ 9 తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకి ఓ శకాన్ని, ఓ నవ రూపుని అందించింది. మీడియాలో ఓ వెలుగు వెలిగి, తిట్టించుకుంది. న్యూస్ ప్రెజెంటేషన్ లో కొత్తదనం చూపించింది. మాయలు చేసింది, కంత్రీలు నడిపింది. ఎలాగోలా నంబర్ వన్ అనిపించుకుంది..!! ఆ టీవీ 9 గోల ఇప్పుడు ఎందుకయ్యా అంటే..?? షేర్లు పడిపోతున్నాయి. కార్యాలయాలు మూతపడుతున్నాయి. తోక చానెళ్లు మూతపడ్డాయి. షేర్ ఏకంగా 60 శాతానికి పైగా పడిపోయింది. ఇది మొత్తం ఉండగా.., మాజీ సీఈవో రవిప్రకాష్ తాజాగా టీవీ 9 లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇప్పుడు మనకు పెద్ద వార్త..!!
రవి ప్రకాష్ పిటిషన్ లో ఏముందంటే..??
“టీవీ 9 ని అమ్మేయండి. నేను కొనేస్తాను. నేను సంస్థలో ఉన్నప్పుడు లాభాల్లో ఉండేది. షేర్ విలువ భారీగా పెరిగింది. ఇప్పుడు అమాంతం పడిపోతుంది. రూ. 270 నుండి రూ. 78 కి పడిపోయింది. మరో నాలుగేళ్ల పాటు సంస్థకి నష్టాలు తప్పవు అని ఆ సంస్థ తన వాల్యుయేషన్ రిపోర్ట్ లో చెప్తుంది. అందుకే వాళ్ళు చెప్తున్న షేర్ ప్రైస్ కి అమ్మేస్తే మొత్తం నేనే కొనేస్తాను. టీవీ 1 , న్యూస్ 9 చానెళ్లు మూసేసారు. బ్రాండ్ విలువ పడిపోయింది. జర్నలిజం ఏ మాత్రం తెలియని వాళ్ళే దీనికి కారణం. అందుకే నాకు అమ్మేయండి, కొనేస్తాను” అంటూ టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ లా ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్ వేశారు. ఇదే ఇప్పుడు మీడియాలో పెద్ద చర్చ.
కార్పొరేట్ పెత్తనం దెబ్బ కొట్టిందా..??
ఏమో టీవీ 9 ని అమ్ముతారో, లేదో… ఒకవేళ అమ్మినా రవి ప్రకాష్ కి అమ్ముతారో.., లేదో తర్వాత విషయం. కానీ..! ఒక టాప్ తెలుగు మీడియా ఛానెల్ దెబ్బ తిన్న మాట వాస్తవం. టీవీ 9 ఇప్పుడు మై హోమ్, మెఘా అనే కార్పొరేట్ కంపెనీల చేతిలో ఉంది. వీళ్ళు స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇంజనీరింగ్ బిల్డర్లు. కానీ కేసీఆరు చలవ, స్వామిజి దీవెనతో టీవీ 9 కి అధిపతులుగా మారిపోయారు. కానీ గడిచిన ఆరు నెలలుగా టీవీ 9 పతనం తట్టుకోలేకపోతున్నారు. కిందికి దిగజారుతుంటే ఆపలేకపోతున్నారు. రూ. 270 ఉన్న షేరు ధర రూ. 78 అయిపొయింది. యూట్యూబ్ లో వ్యూయర్స్ తగ్గిపోతున్నారు. రాజనీకాత్ డిబేట్ కి కనీసం 2 వేల మంది చూడడం లేదంటే ఇక పతనం ఊహించుకోవచ్చు.
ఛానెల్ కి మార్కెట్ లో పేరు మసకబారింది. ర్యాంకింగ్స్ లో ఏదో మాయలు చేసి నెట్టుకొస్తున్నప్పటికీ యాడ్లు రావడం లేదు. మొత్తానికి గడిచిన ఆరు నెలల కాలంలోటీవీ 9 లో ఊహించని పతనం ఆరంభయింది. స్వతహాగా ఒక జర్నలిస్టు లేదా ఒక కీలక వ్యాపారవేత్త ఎవరైనా ఇటువంటి బ్రాండెడ్ చానెళ్లకు అధిపతులుగా ఉంటె కొత్త ఆలోచనలు చేసే వారు, పైకి లేపేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ యజమానులు ఆ ఆలోచనలు చేయడం లేదు. “చూద్దాం, చేద్దాం” అంటూ పెత్తనం కోల్పోతున్నారు. అందుకే రవి ప్రకాష్ తనకు ఇచ్చేయాలి అంటూ పిటిషన్ వేశారు.