TDP Janasena: ఏపిలో జనసేన – టీడీపీ పొత్తు ఉంటుందా..? ఉండగా..? ఒక వేళ పొత్తు ఉంటే ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు..? ఎవరు ఎన్ని సీట్ల నుండి పోటీ చేస్తారు.. ? పవర్ షేరింగ్ ఉంటుందా..? ఉండదా..? ఈ కూటమిలోకి బీజేపీ చేరుతుందా..? లేదా..? టీడీపీతో కలిసేందుకు బీజేపీని జనసేన ఒప్పిస్తుందా..? లేదా అన్న అనేక సందేహాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉన్నాయి. టీడీపీ – జనసేన మధ్య అంతరంగిక ఒప్పందం ఎలా ఉండబోతున్నది..ఆ పార్టీలో చర్చ ఏ ప్రతిపాదనలతో వెళ్లాలి అనుకుంటున్నారు అనేవి పరిశీలిస్తే.. ప్రధానంగా జనసేన, తెలుగు దేశం పార్టీలకు కామన్ శతృవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. ఈ సారి ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే ఆ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తు కష్టమే. ఆ పార్టీ క్యాడర్ కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటుంది. ఇక జనసేన పరిస్థితి కూడా ఇంచుముంచు అదే విధంగా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ ప్రారంభించిన తరువాత పదేళ్ల వరకూ అధికారంలోకి రాకపోయినా, కొన్ని స్థానాలు అయినా గెలుచుకోకపోతే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి ఉమ్మడిగా అధికార పార్టీని దెబ్బతీయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనగా ఉంది. ఆ క్రమంలో భాగంగానే టీడీపీతో పొత్తుకు జనసేన సంకేతాలు ఇచ్చింది. రెండు పార్టీలకు పొత్తు అవసరమే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
TDP Janasena: కలిసి పోటీ చేస్తేనే ..
జనసేనతో పొత్తు లేకపోతే అధికారంలోకి వస్తామన్న ధీమా టీడీపీలో ఉన్నా మరో పక్క అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక నేపథ్యంలో అధికారంలోకి రాము అన్న భయం టీడీపీలో ఉంది. అదే విధంగా పొత్తు లేకపోతే జనసేన అధికారంలోకి రావడం అసంభవం. కనీసం 20 – 25 సీట్లు గెలుచుకుంటుందా లేదా అనేది కూడా అనుమానమే. పొత్తు లేకుండా జనసేన ఎన్నికలకు వెళితే మినిమం 5 -6 సీట్లు మాగ్జిమమ్ 18 – 20 గెలుచుకుంటుంది. అందుకే ఈ రెండు పార్టీలు పొత్తు అవశ్యకాన్ని గుర్తించాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే .. జనసేన పవర్ షేరింగ్ అడుగుతోంది. పొత్తుతో పోటీ చేస్తే జనసేన పోటీ చేసే స్థానాల్లో 60 -70 శాతం సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. జనసేనతో పొత్తు ఉంటే టీడీపీకి కూడా అదనంగా 15 -20 సీట్లు వస్తాయి. కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అయితే సీఎం ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. పవన్ కళ్యాణ్ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి స్థాయి క్యాంటేట్. కానీ టీడీపీ పవన్ కళ్యాణ్ కు సీఎం సీటు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. చంద్రబాబు శపథం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి అడుగుపెడతానని. ఆ శపథం నెరవేర్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ కు సీఎం సీటు ఇవ్వలేరు.
TDP Janasena: మమత బెనర్జీ, కేసిఆర్ లు కేంద్ర మంత్రిగా చేసిన తరువాతే
ఒక వేళ చంద్రబాబు సీఎం అయితే ఆయన మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉండలేరు. అందుకు జనసేన శ్రేణులు అంగీకరించరు. పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి సీటు ఇస్తే చంద్రబాబు మంత్రిగా ఉండటానికి టీడీపీ శ్రేణులు అస్సలు అంగీకరించరు. అంత సీనియారిటీ ఉన్న నేత పవన్ మంత్రివర్గంలో ఉండలేరు. అందుకోసం ఒక ప్రతిపాదన కొత్త తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన చేసే వారు గత ఉదాహారణలను చెబుతున్నారు. అవి ఏమిటంటే.. మమతా బెనర్జీ ఆరు సార్లు ఎంపిగా చేశారు. ఆ తరువాత ప్రాంతీయ పార్టీ అధినేతగా ఎంపీగా చేసి కేంద్ర మంత్రి అయి ఆ తరువాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక స్కోప్ ఏర్పడిన తరువాత అక్కడ లెఫ్ట్ పార్టీలు బలహీన పడిన తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె నేరుగా సీఎంగా కాలేదు. ఎంపీ, కేంద్ర మంత్రి తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో కేసిఆర్ కూడా ముందుగా పార్టీ పెట్టిన తరువాత ఎంపీగానే పోటీ చేశారు. 2004లో కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తరువాత దానికి కూడా రాజీనామా చేసి ఎమ్మెల్యే అయ్యారు. పలు ప్రాంతీయ పార్టీల నేతలు పార్టీలు పెట్టిన వెంటనే డైరెక్ట్ గా సీఎంలు అవ్వలేదు. చంద్రబాబు కూడా తొలుత ఎమ్మెల్యేగా, తరువాత మంత్రిగా పని చేశారు. ఆ తరువాతనే ముఖ్యమంత్రి అయ్యారు.
పార్లమెంట్ కు పవన్ పోటీ ..?
పవన్ కళ్యాణ్ మొదటి సారి ఎమ్మెల్యే అయిన వెంటనే సీఎం అయ్యే కంటే పవన్ కళ్యాణ్ ఎంపిగా పోటీ చేయాలి. ఈ కూటమిలో బీజేపీ ఉంటే కేంద్రంలో ఈ పార్టీ అధికారంలోకి పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రి పదవి ఈజీగా వస్తుంది. ఒక వేళ బీజేపీ అధికారంలోకి రాకపోయినా తృతీయ కూటమి వస్తే ఆ కూటమికి కూడా ప్రాంతీయ పార్టీల ఎంపీల బలం కావాల్సి ఉంటుంది. అలా కూడా పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు రూ.55,560 కోట్లు రావాలి, అలాగే ప్రత్యేక హోదా రావాలి. రైల్వే జోన్ రావాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోవాలి. విభజన చట్టం హామీలు నెరవేరాలి. వీటిని పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుండి చక్రం తిప్పి రాష్ట్రానికి తీసుకురావచ్చు. అలా చేస్తే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి మేలు చేశారు అన్న ఇమేజ్ ఆయనకు వస్తుంది. చంద్రబాబు ఇక్కడ సీఎంగా ఉంటూ రాష్ట్రానికి ఒక గాడిలో పెట్టవచ్చు. ఇద్దరు కలిసి పని చేస్తే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చవచ్చు. అభివృద్ధి వైపునకు తీసుకువెళ్లవచ్చు.
TDP Janasena: 2029 లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా..
ఆ తరువాత 2029 నాటికి పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి క్యాండెట్ గా ప్రకటించి ఈ రెండు పార్టీలు ముందుకు వెళ్లవచ్చు. 2024 నుండి 2029 వరకూ ఈ ఇద్దరూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ప్రజల మనసులను గెలుచుకుంటే 2029 ఎన్నికల్లో మళ్లీ సక్సెస్ కావచ్చు. పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యేందుకు ఇంకా వయసు ఉన్నందున ఈ ప్రతిపాదనతో ముందుకు వెళితే బాగుంటుంది అని రాజకీయ విశ్లేషకులు, పార్టీలోని కొందరు పెద్దలు అభిప్రాయపడుతున్నారు. లేదు రెండు పార్టీలు ముఖ్యమంత్రి పీఠంపై పట్టుబట్టి కూర్చుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.