Bhimaa: గత నెలలో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాల్లో భీమా ఒకటి. ఇదొక ఫాంటసీ డ్రామా. ఏ హర్ష డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ద్విపాత్రాభినయం చేశాడు. ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్, నాజర్, నరేష్, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, ముఖేష్ తివారి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించాడు.
మహా శివరాత్రి కానుకగా 2024 మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన భీమా మూవీ అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. రొటీన్ స్టోరీ మరియు బలహీనమైన స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద మైనస్ లుగా మారాయి. అయితే భీమాగా పోలీస్ క్యారెక్టర్ లో, రాముగా పురోహితుడి పాత్రలో గోపీచంద్ అదరగొట్టాడు. రెండు పాత్రలకు వేరియేషన్స్ చూపిస్తూ వెండితెరపై గోపీచంద్ అదరగొట్టేశాడు. కథలో పురాణ నేపథ్యం, రవి బస్రూర్ అందించిన బీజీఎం, ద్వితీయార్థం, యాక్షన్స్ సన్నివేశాలకు మంచి మార్కులు పడ్డాయి.
ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్స్ కు వెళ్లిన ప్రేక్షకులను భీమా బాగానే మెప్పించింది. అయితే ఫుల్ రన్ లో అనుకున్న స్థాయిలో ఈ చిత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇకపోతే భీమా మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు చాలా కాలం నుంచి ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు. అయితే ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో భీమా మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయింది.
భీమా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 25న భీమా స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఏప్రిల్ 25 అర్ధరాత్రి నుంచే ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. ఇందులో భాగంగానే గోపీచంద్ ప్రమోషనల్ వీడియోను హాట్స్టార్ విడుదల చేసింది. కాబట్టి థియేటర్స్ లో భీమా చిత్రాన్ని మిస్ అయిన వారు హాట్ స్టార్ చూసి ఎంజాయ్ చేసేయండి.
కాగా, గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న గోపీచంద్ భీమా మూవీతో మరో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపిచంద్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. వీరి కాంబో మూవీకి విశ్వం అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేశారు. అమర్ అక్బర్ ఆంటోనీ వంటి డిజాస్టర్ తర్వాత ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న శ్రీను వైట్ల విశ్వం మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వేణు దోణెపూడి నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ కెరీర్ లో 32వ ప్రాజెక్ట్ ఇది. ఇటీవలె సెట్స్ మీదకు విశ్వం మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరి ఈ చిత్రంతో అయినా గోపీచంద్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా.. లేదా.. అన్నది చూడాలి.