Ram Pothineni: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్.. దేవదాసు మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టించాడు. తనదైన నటన, డైలాగ్ డెలివరీ యాటిట్యూడ్ తో టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకొన్నాడు. సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. కెరీర్ ఆరంభంలో లవర్ బాయ్ గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న రామ్.. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్ హీరోల జాబితాలో చేరిపోయాడు.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కెరీర్ పరంగా ఇటు రామ్ కు మరియు అటు పూరీ జగన్నాథ్ కు ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. ఇస్మార్ట్ శంకర్ అనంతరం రామ్ మాస్ కథలను ఎంచుకుంటూ రెడ్, ది వారియర్, స్కంద వంటి సినిమాలు చేశాడు. కానీ ఈ చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. మరోవైపు పూరీ జగన్నాథ్ టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి లైగర్ చిత్రాన్ని తీశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం రామ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నాడు. గత ఏడాది ఈ చిత్రం ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ బ్యానర్పై ఛార్మీ కౌర్తో కలిసి ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా అలరించబోతున్నాడు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. వాస్తవానికి డబుల్ ఇస్మార్ట్ మూవీని మహా శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల చేయనున్నట్లు చిత్రటీమ్ ప్రకటించింది. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు.
ఇప్పటికైతే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. కొద్దిగా టాకీ పార్ట్ మరియు రెండు మూడు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని పూర్తి చేసి డబుల్ ఇస్మార్ట్ ను గ్రాండ్ గా విడుదల చేయాలని పూరీ జగన్నాథ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు రామ్ పోతినేని రూ. 25 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని మొన్నామధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్ రెమ్యునరేషన్ కు సంబంధించి మరో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
డబుల్ ఇస్మార్ట్ అనంతరం చేయబోయే చిత్రాలకు రామ్ ఇంకాస్త భారీగా పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. ఒక్కో చిత్రానికి రూ. 30 కోట్లు అడిగి షాకిస్తున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఓ స్టార్ డైరెక్టర్ రామ్ తో సినిమా చేసేందుకు చర్చలు జరిపాడట. ఒక లైన్ చెప్పి రామ్ ను మెప్పించాడట. కానీ చివర్లో రామ్ రెమ్యునరేషన్ ఎక్కువగా చెప్పడంతో సదరు డైరెక్టర్ డ్రాప్ అయిపోయాడట. ఇలాగే ఇంకొందరు దర్శకనిర్మాతలు కూడా రామ్ రెమ్యునరేషన్ విని ఆయనతో సినిమా అంటేనే భయపడిపోతున్నారట. రెమ్యునరేషన్ పరంగా అగ్ర హీరోలనే రామ్ మించిపోతున్నాడని చెవులు కొరుక్కుంటున్నారట.