Tollywood Comedians: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్లకు కొరత లేదు. ప్రతి ఏడాది ఎంతోమంది హాస్యనటుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఒకప్పుడు కమెడియన్లు కేవలం కామెడీ పాత్రలే చేసేవారు. కానీ ఇప్పటి రోజుల్లో కామెడీతో పాటు అన్ని రకాల పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొందరైతే హీరోలుగా కూడా మారుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే ఎందరో కమెడియన్లు హీరోలుగా మారారు. అయితే వారిలో కొందరు మాత్రమే ప్రస్తుతం ఫామ్ లో ఉన్నారు. వారెవరు ఇప్పుడు తెలుసుకుందాం.
సుహాస్.. మొదట షార్ట్ ఫిల్మ్స్ లో నటించేవాడు. 2018లో పడి పడి లేచే మనసు మూవీతో వెండితెరపై అడుగు పెట్టాడు. కామెడీ రోల్స్ పోషిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2020లో వచ్చిన కలర్ ఫోటో మూవీతో సుహాస్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రాలతో హీరోగా సుహాస్ మరో రెండు హిట్స్ అందుకుని కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. పూర్తిస్థాయి హీరోగా మారిపోయిన సుహాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 2.5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు.
టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ప్రియదర్శి పులికొండ ఒకడు. పెళ్లి చూపులు మూవీతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. ఆరేళ్లలోనే దాదాపు యాభై చిత్రాల్లో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. 2019లో వచ్చిన మల్లేశం మూవీతో హీరోగా మారిన ప్రియదర్శి.. బలగంతో బిగ్ హిట్ కొట్టాడు. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ హీరోగా ప్రియదర్శి ఇమేజ్ ను డబుల్ చేసింది. ప్రస్తుతం కథానాయకుడిగా డార్లింగ్ అనే మూవీ చేస్తున్నాడు. అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నభా నటేష్ హీరోయిన్ గా ఎంపిక అయింది. అయితే ఈ సినిమాకు కోసం ప్రియదర్శి రూ. 2 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.
టాలీవుడ్ లో చాలా ఏళ్ల నుంచి కమెడియన్ గా కొనసాగుతున్న టాలెంటెడ్ నటుల్లో సత్యం రాజేష్ ఒకరు. ఈయన మా ఊరి పొలిమెరా మూవీతో హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం కథానాయకుడిగా వరుస చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా టెనెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. వై యుగంధర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సత్యం రాజేష్ హీరోగా నటిస్తే.. మేఘ చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ కీలక పాత్రలను పోషించారు. తాజాగా విడుదలైన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ టాక్ లభించింది. ఇక సత్యం రాజేష్ కథానాయకుడిగా ఒక్కో సినిమాకు రూ. 60 లక్షలు అందుకుంటున్నాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ నుంచి హీరోగా మారి సత్తా చాటుతున్న వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు.జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్.. ఆపై సినిమాల్లోకి వచ్చాడు. కామెడీ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. సాఫ్ట్వేర్ సుధీర్ మూవీతో హీరోగా మారాడు. గాలోడు చిత్రంతో హిట్ అందుకున్నాడు. గత ఏడాది కాలింగ్ సహస్ర మూవీతో పలకరించిన సుధీర్.. ప్రస్తుతం గోట్ పేరుతో ఓ మూవీ చేస్తున్నాడు. రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. సుధీర్ రూ. 80 లక్షల నుంచి కోటి వరకు డిమాండ్ చేస్తున్నాడు.