ఆయుర్వేదం మన తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్న సంపద. ఎన్ని ప్రైవేటు మందులు వచ్చినా ఆయుర్వేదానికి ఉన్న ప్రత్యేకత మాత్రం పోదు. అలాంటి ఆయుర్వేదం కొన్ని ఆరోగ్య సూత్రాలను పటించాలని చెబుతోంది. దాంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. జబ్బులు మన దగ్గరకు చేరవని చెబుతోంది. మనం తినే ఆహారం.. దాని తీసుకునే పద్దతుల వలనే మనం ఎలా ఉంటామనేది తెలుస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఏ జాగ్రత్తలు తీసుకుంటే మన జీర్ణక్రియ బాగుంటుందో అవే తీసుకోవాలని చేబుతోంది. అందుకోసం తొమ్మిది ఆయుర్వేద మార్గదర్శకాలను పాటించాలని చెబుతోంది. ఆ విషయాలు మీకోసం.ఆకలితో ఉన్నప్పుడే తినాలి. నిజంగా ఆకలి వేసినప్పుడే తినాలని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే ప్రశాంతమైన, సౌకర్యవంతమైన ప్రదేశంలోనే కూర్చుని తినాలి. హడావిడితో ఎక్కడ బడితే అక్కడ నిలబడి తినకూడదు. టీవీ చూస్తూ, పుస్తకం చదువుతూ, ఫోన్, ల్యాప్టాప్ లాంటివి వాడుతూనే అస్సలు తినకూడదు. అలా చేస్తే అది మనకు వంటపట్టదు.
సరైన పరిమాణంలో ఆహారాన్ని తీసుకోవాలి. ఒక్కోసారి ఒక్కో రకమైన కోరికలు కలుగుతుంటాయి. అట్లాంటప్పుడు కొందరు ఎక్కువ తింటారు. కొందరు తక్కువగా తింటారు. అలా అసలు చేయొద్దు. మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. వేడి వేడి భోజనం తినడం మంచిది. అలాగే నాణ్యమైన భోజనాన్నే తినాలి. మీకు పడనివి అసలు తినకూడదు. తినేటప్పుడు ఆస్వాదిస్తూ తినాలి.
అలాగే బాగా నమిలి తినాలి.దీంతో మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా క్రమం తప్పకుండా తినాలి. వీలైనంత వరకూ రోజూ ఒకే సమయంలో తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారం తీసుకోవడంలో సమయ పాలన పాటించడం వలన మన జీర్ణ వ్యవస్థకు ఒక ప్లాన్ ప్రకారం వెళ్లే సూచనలు ఇచ్చినట్లు అవుతుంది. దీంతో మనకు ఎన్నో లాభాలు ఉంటాయియని ఆయుర్వేదం చెబుతోంది.