మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఘోర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ లగ్జిరీ ప్యాసింజర్ బస్సుకు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో 11 మంది సజీవ దహనం కాగా మరో 38 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ప్రయాణీకులతో వేగంగా వెళుతున్న లగ్జరీ బస్సు నాసిక్ – ఔరంగాబాద్ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఆ వెంటనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ప్రయాణీకులు తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. 11 మంది ప్రయాణీకులు సజీవ దహనం కాగా మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీస్, అగ్ని మాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసి గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అగ్ని ప్రమాదం కారణంగా బస్సులోని ప్రయాణీకులు హాహాకారులు చేస్తున్నా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయనీ, ప్రమాదంపై పోలీస్, ఫైర్ శాఖలకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల వంతున పరిహారం ప్రకటించారు సీఎం ఏక్ నాథ్ శిండే. క్షతగాత్రులకు అయ్యే చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.