Fake Currency : ఒడిశాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.7.90 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కోరాపుట్ జిల్లాలోని పొటాంగి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై సుంకీ అవుట్ పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, చత్తీస్గడ్ లోని రాయపూర్ నుండి విశాఖపట్నంకు వెళుతున్న ఓ కారులో పెద్ద ఎత్తున నకిలీ నోట్లు ఉండటాన్ని గమనించారు. కారులో ఉన్న ముగ్గురు యువకులను, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై కోరాపుట్ ఎస్పీ గుంటుపల్లి వరుణ్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద ఎత్తున నకిలీ నోట్లు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రూ.7.9కోట్ల విలువైన రూ.500 ల నకిలీ నోట్లు ట్రాలీ బ్యాగ్లలో పెట్టి తరలిస్తున్నారని చెప్పారు. నిందితులు చత్తీస్గడ్ లోని జంజాగిర్ లోని చంపా జిల్లాకు చెందిన వారని తెలిపారు. వారి వద్ద నుండి అయిదు మొబైల్ ఫోన్లు, రూ.35వేల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఐడి ఫ్రూఫ్లు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాయపూర్ నుండి విశాఖపట్నంలోని వ్యక్తికి నకిలీ నోట్లు అందించేందుకు నిందితులు వెళుతున్నట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు.
విశాఖలో కలకలం
పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ ఒడిశాలో పట్టుబడటం, ఆ కరెన్సీ విశాఖ తరలిస్తున్నదిగా తెలియడంతో విశాఖపట్నంలో తీవ్రకలకలాన్ని రేపుతోంది. ఈ నెల 10వ తేదీన గ్రేటర్ విశాఖ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీ ఎత్తున నకిలీ కరెన్సీ తెప్పిస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఒడిశా పోలీసుల దర్యాప్తులో.. ఆ నకిలీ కరెన్సీ విశాఖలో ఒ వ్యక్తికి చేరవేసేందుకు తీసుకువెళుతున్నట్లు నిందితులు తెలిపినట్లు సమాచారం. దీంతో విశాఖలో నకిలీ నోట్లు తెప్పిస్తున్న వ్యక్తి ఎవరు అనే దానిపై చర్చించుకుంటున్నారు.
Fake Currency seized at Koraput