బీహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. బల పరీక్షలో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమి సర్కార్ కు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. బలపరీక్షకు ముందు నితీష్ కుమార్ అసెంబ్లీలో బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేదని అన్నారు. 2015 లో బీజేపీని తానే గెలిపించాననీ, 2024 లో తానేంటో నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు నితీష్ కుమార్. వాజ్ పేయి. అద్వానీ లే తన మాట గౌరవించే వాళ్లనీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు బీజేపీలో లేవని అన్నారు. 2017 లో తేజస్వీ యాదవ్ పై అవినీతి ఆరోపణలు చేశారనీ, ఇప్పటి వరకూ ఎందుకు వాటిని నిరూపించలేకపోయారని నితీష్ ప్రశ్నించారు. బీజేపీ నేతలది ప్రచారం ఎక్కువ, పని తక్కువ అని విమర్శించారు.
ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, డబ్బు ఆశ చూపి వారిని కొనుగోలు చేయడం బీజేపీ ఫార్ములా అని విమర్శించారు. ఆర్ జేడీ – జేడీయు నూతన భాగస్వామ్యం చారిత్రాత్మకమనీ, తమ భాగస్వామ్యం సుదీర్ఘ కాలం నిలువనుందని దీనిని ఎవరూ పడగొట్టలేరని ధీమా వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసి అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. బలపరీక్షకు ముందుగానే స్పీకర్ రాజీనామా చేశారు.
నితీశ్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కొంటున్న వేళ ఆర్ జేడీ సీనియర్ నేతల ఇళ్లపై సీబీఐ అధికారులు సోదాలు జరపడం హాట్ టాపిక్ అయ్యింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రి గా లాలూ ప్రసాద్ ఉన్న రోజుల్లో జరిగిన ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాట్నాలోని ఆర్ జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ నివాసం సహా ఆర్ జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్ అష్పాఖ్ కరీమ్, ఆర్జెడీ మాజీ ఎమ్మెల్సీ సుభోధ్ రాయ్ నివాసాల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారనీ, అందులో ఎలాంటి అర్దం లేదని, భయంతో తమ ఎమ్మెల్యేలు వారితో (బీజేపీ) కలుస్తారన్న భావనతో ఆ దాడులు జరిపిస్తున్నారని ఎమ్మెల్సీ సునీల్ సింగ్ విమర్శించారు.