ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లోక్ మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. పూణెలో ది తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును స్వీకరించారు పీఎం మోడీ. ఇవి తనకు గుర్తుండిపోయే క్షణాలు అని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రధాన మంత్రి మోడీని అప్యాయంగా పలకరించారు. ఓ పక్క విపక్షాల కూటమి (ఇండియా)లో కీలక నేత గా ఉన్న శరద్ పవార్ .. మోడీతో వేదిక పంచుకోవడంపై కూటమి నేతల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
విపక్షాల కూటమి మూడవ సమావేశం త్వరలో మహారాష్ట్రలో జరగనున్న నేపథ్యంలో శరద్ పవార్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూటమి నేతలకు మింగుడుపడటం లేదు. మణిపూర్ సమస్య సహా అనేక విషయాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) సభ్యులు మోడీ సందర్శించిన దగడూసేఠ్ గణేష్ ఆలయానికి కొద్ది దూరంలో నిరసన వ్యక్తం చేశారు.
ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ .. లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డును 1983 లో ఏర్పాటు చేయగా, ప్రతి ఏటా ఆగస్టు 1న దీన్ని ప్రధానం చేస్తూ వస్తున్నారు. పౌరుల్లో దేశ భక్తిని పెంపొందించడంతో పాటు మోడీ నాయకత్వ పటిమకు ఈ ఏడాది పురస్కారాన్ని అందజేసినట్లు ట్రస్ట్ నిర్వహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే, డిప్యూటి సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్ .. తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్రం ఏమన్నందటే..?