Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ), ఆప్ (ఏఏపీ) సర్కార్ మధ్య కొంత కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో అధికారుల నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తో ఈ సమస్య మరింత ముదిరింది. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఆప్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయింగా, ఆప్ సర్కార్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఢిల్లీలో అధికారుల నియంత్రణ, బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.
ఈ తరుణంలోనే ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్ పర్సన్ నియామకంపై దాఖలైన కేసు విచారణ ఇవేళ జరిగింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కీలక సూచన చేసింది. రాజకీయ వైషమ్యాలు వీడి సమస్య పరిష్కారానికి సంయుక్తంగా కృషి చేయాలని ఎల్జీతో పాటు ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కార్ కు సుప్రీం సూచించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఇద్దరూ రాజకీయ వైషమ్యాలకు అతీతంగా ప్రవర్తించాలని అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఎల్జీ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ లు కకలిసి డీఈఆర్ సీ చైర్మన్ ఎంపిక కోసం మాజీ న్యాయమూర్తుల పేర్లపై చర్చించాలని సూచించింది. తదుపరి విచారణను జూలై 20వ తేదీ వాయిదా వేసింది.
ఇంతకు ముందు ఆప్ సర్కార్ కు సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో అధికారుల బదిలీ, నియామకాల విషయంలో ఎల్జీని తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్న ఆప్ సర్కార్ .. దాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. మరో పక్క ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తొంది.