కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కొద్ది సేపటిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ అభియోగాలపై నమోదైన కేసులో విచారణకు హజరు కావాలని ఈడీ సోనియాకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో రెండు పర్యాయాలు సమన్లు జారీ చేసినప్పటికీ సోనియా కరోనా కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినందున విచారణకు హజరు కాలేదు. తాజాగా జారీ చేసిన సమన్ల మేరకు ఈ రోజు 11 గంటలకు సోనియా ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. మరో పక్క రాహుల్ గాంధీ ని ఈడీ విచారణ చేసింది. అయిదు రోజుల పాటు ఆయన్ను ఈడీ అధికారులు విచారించారు.
రాహుల్ విచారణ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. అదే విధంగా ఈ సారి సోనియా.. ఈడీ ముందు హజరుఅవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం, ఈడీ ఆఫీసు తదితర ముఖ్య ప్రదేశాల్లో పోలీసులు భారీ మొహరించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలోని బీజేపీ .. తమ పార్టీ నేతలను ఈడీ విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.