ప్రపంచంలో అగ్రరాజ్యంగా కీర్తించబడే అమెరికా.. చిగురుటాకులా వణికిన రోజు.. ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించే అగ్రరాజ్యం ఉగ్రదాడులకు బలైపోయిన రోజు.. ఉగ్రవాదంలో మరిగిపోతున్న ఆల్ ఖైదా తన ప్రతాపం చూపిన రోజు.. సెప్టెంబర్ 11’ 2001. ఈ తేదీని మర్చిపోవడం అమెరికన్లకు అంత సులభం కాదు. ఒసామా బిన్ లాడెన్ ఆధ్వర్యంలో నాలుగు విమానాలు హైజాక్ చేసి అమెరికా స్థైర్యం ఆర్ధిక మూలాల మీద దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో ఉగ్రవాదులు తెగబడ్డారు. న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ గా పిలిచే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను రెండు విమానాలు నేలమట్టం చేశాయి. మూడో విమానం వాషింగ్టన్ లోని శత్రు దుర్భేధ్యమైన పెంటగాన్ పై దాడి చేసింది. నాలుగో విమానం నివాసం వైట్ హౌస్ లక్ష్యంగా వెళ్తూండగా ప్రయాణికుల తిరుగుబాటు, అలజడి కారణంగా పెన్సిల్వేనియాలోని పొలాల్లో పడిపోయింది. ఈ దారుణ ఘటన జరిగి నేటికి 19 ఏళ్లు.
ఆరోజు ఎంత భీభత్సం జరిగిందంటే
అమెరికన్ వార్తా సంస్థల ప్రకారం.. ఆరోజు ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ దారుణకాండలో మొత్తం 19 మంది ఉగ్రవాదులతో సహా 2,977 మంది చనిపోయారు. నాలుగు విమానాల్లోని ప్రయాణికులు అందరూ మృతి చెందారు. టవర్స్ ను విమానాలు ఢీ కొట్టడం ద్వరా సుమారు 10 వేల గ్యాలన్ల ఇంధనం మండింది. దీంతో 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందని.. ఆ వేడికి భవనాలు కుప్పకూలిపోయాయి. దుమ్ము, ధూళి ఆవరించి ఎందరి ప్రాణాలో గాల్లో కలిసిపోయాయి. పెంటగాన్ పై జరిగిన దాడిలో 184 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువమంది పౌరులే ఉన్నారు. విదేశీయుల సంఖ్య కూడా ఎక్కువే. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు నేటికీ ఈ విలయం గుర్తొస్తే వణికిపోతారు.
ప్రతీకారం తీర్చుకున్న అమెరికా..
9/11 గా అమెరికా వర్ణించే ఈ రాక్షసకాండకు ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. లక్షకు పైగా టన్నుల స్టీల్ ను అమెరికాలో అనేక చోట్ల ఉపయోగించగా.. కొంత ఇండియా, చైనాకు విక్రియించారు. ట్విన్ టవర్స్ నేల కూలిన ప్రాంతాన్ని అమెరికా ‘గ్రౌండ్ జీరో’గా పిలుచుకుంటారు. ప్రతి ఏటా అక్కడ మృతులకు నివాళులర్పిస్తారు. దాడుల సమయంలో అధ్యక్షుడిగా ఉన్న జార్జి బుష్ ఆల్ ఖైదా.. ఒసామా బిన్ లాడెన్ అంతం చూడాలని వేట కొనసాగించారు. వందల కోట్లు ఖర్చు చేశారు. చివరికి ఒబామా అధ్యక్షుడు అయ్యాక ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ లో అంతమెందించారు.