ఏపీ సీఎం జగన్ అంటే అందరూ అనుకునేది వేరు.., నిజమైన జగన్ వేరు…!! సంచలన నిర్ణయాలు తీసుకుంటాడు.., ప్రత్యర్థులకు షాక్ ఇస్తాడు.., వివాదంలో వేలు పెడతాడు.., చివరి వరకు నిలబడతాడు.., సరైన ముగింపు ఇస్తాడు..! అంతర్వేది రథం దగ్ధం అంశం సిబిఐకి అప్పగించడం అటువంటిదే. “బీజేపీ గొడవ చేస్తుంది, పవన్ ప్రకటనలు చేస్తున్నాడు, వారి మిత్రులైన వీహెచ్ పీ మరీ శృతిమించుతోంది. అందుకే ఇవన్నీ నాకెందుకు మీరే తేల్చుకోండి. మీ కేంద్రం, మీ దర్యాప్తు సంస్థతో విచారించుకోండి” అన్నట్టు సీబీఐ అస్త్రాన్ని సరైన సమయానికి వదిలారు జగన్.
అంతర్వేదితో జగన్ అంతర్యుద్ధం..! అదే సీబీఐ అస్త్రం..!!
ఏ పాలకుడికీ తన పదవి, తన హోదా కంటే దేవుడు, మతం సెంటిమెంట్ ముఖ్యం కాదు. దానికి జగన్ కూడా అతీతుడు కాదు. జగన్ క్రిస్టియన్ అయితే కావచ్చు కానీ.., మూర్ఖపు హిందూ వ్యతిరేకి మాత్రం కాదు. హిందూ దేవాలయాలకు ముప్పు వస్తుంటే… రాజకీయంగా తనకు నష్టం జరుగుతుంటే.. తనపై బురద పడుతుంటే చూస్తూ ఊరుకునే పాలకుడు కాదు. మరీ అలా దేవాలయాల విషయంలో వదిలేసే టైపు కాదు. అందుకే అంతర్వేది విషయంలో బీజేపీ ప్లస్ ఆ పార్టీ తోకలన్ని ఎక్కువ చేస్తుంటే సింపుల్ గా సమాధానం చెప్పాడు. అంతర్వేది అస్త్రాన్ని రాజకీయంగా వాడుకుని కాస్తో.., కూస్తో జగన్ వ్యతిరేకతని మూటగడదాం అని బీజేపీ, జనసేన, టీడీపీ అనుకుంటే జగన్ దాన్ని ఒకే ఒక్క నిర్ణయంతో దెబ్బ కొట్టేశారు. ఇప్పుడు కేంద్రం చేతిలో రాయి ఉంది. ఎవర్ని కొడతారో కొట్టుకోవాల్సింది వారే.
చిన్నగా వదిలేయడానికి లేదు…!!
ఇది కూడా చిన్నగా వదిలేయడానికి వీలు లేని అంశమే. హిందూ దేవాలయాల మీద దాడులు వరుసగా జరుగుతున్నాయి. రథాలను తగలబెట్టడం కూడా ఇది మొదటిది కాదు.. భీమవరం సోమేశ్వర స్వామి ఆలయ రథం ధ్వంసం కావడం, దాని తర్వాత నెల్లూరు ఆలయ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం కాలిపోవడం.., ఇప్పుడు తాజాగా అంతర్వేది నరసింహ స్వామి వారి రథంకు నిప్పు పెట్టడం చూస్తుంటే ఇది ఓ మతానికి అభద్రతాభావం కలిగించే అంశాలు గానే కనిపిస్తున్నాయి. అలాగే హిందూ సంప్రదాయాలు, సంస్కృతి విషయంలో గాని రాష్ట్ర ప్రభుత్వంపై మరొక వేయాలని కొన్ని శక్తులు ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ కేసులన్నీ చాలా కీలకమైనవి సున్నితమైనవి.. ఇలాంటి కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేస్తే స్థానిక ఒత్తిళ్లు ఉండవచ్చు అనే ప్రచారమూ, రిస్కు ఉంటుంది. అందుకే దీనికి సీబీఐ సరైన మందు. సరైన సమయంలో సరైన మందు వేసి జగన్ అంతర్వేదితో అంతర్యుద్ధంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సాక్షి ఓవర్ యాక్షన్..!!
అంతర్వేది రథం కాలిపోయిన ఘటనలో నిజానిజాలు తెలుసుకోకుండా ప్రాథమిక దర్యాప్తు లేకుండానే ఆ రథం కేవలం పొరపాటు వల్ల లేక ఆకతాయి పనివల్ల జరిగి ఉండొచ్చని సాక్షి కథనం వెలువరించడం నిజంగా బాధ్యతా రాహిత్యమే. కేసులో కనీస దర్యాప్తు లేకుండానే రథం దగ్గర తేనెతుట్టె ఉందంటూ సాక్షి పండించిన కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. దానిపై విపరీతమైన ట్రోలింగ్ ఎక్కువయ్యాయి. ప్రభుత్వాన్ని కాపాడాలని ఆత్రుత ఉన్న సాక్షి… అందుకు సరైన లాజిక్ లేకపోవడం ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉంది. సాక్షి పత్రిక అత్యుత్సాహం, ప్రభుత్వ భజన వార్తల కారణంగా ఒక్కోసారి జగన్ ఇరుకున పడుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?