విశాఖ, జనవరి 13: కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును ఆదివారం విశాఖలో ఎన్ఐఎ అధికారులు విచారించారు. విజయవాడ నుండి ఉదయం విశాఖకు శ్రీనివాసరావును తీసుకువచ్చిన ఎన్ఐఎ అధికారులు జిల్లాలోని బక్కనపాలెం ఎపిఎస్పి పోలీస్ శిక్షణ కేంద్రంలో విచారణ నిర్వహించారు. నిందితుడి తరపు న్యాయవాది సలీం సమక్షంలోనే మూడు గంటల పాటు విచారణ చేశారు. ఏడు రోజులు విచారణ నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయం విదితమే. తొలి రోజు ఎంక్వైరీ ఎపిఎస్పి బక్కన్నపాలెం పోలీస్ శిక్షణ కేంద్రంలో పూర్తి చేసిన తరువాత అధికారులు మరో ప్రాంతానికి తరలించారు.
హైదరాబాదు లేదా చెన్నై ఎన్ఐఎ కార్యాలయానికి నిందితుడిని తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దాడి కేసులో నిందితుడిని శనివారం కోర్టు అనుమతితో విజయవాడ జైలు నుండి ఎన్ఐఎ అధికారులు విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్న విషయం విదితమే.