Anantapur: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో పలువురు తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. వారి సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కు సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే బాధితుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. పిర్యాదు దారుల సమస్యలను పరిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
విద్యుత్ శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తూ విద్యుత్ షాక్ తో కుడిచేయి కోల్పోయానని, తనను ఆదుకోవాలని జి రామాంజి .. సీఎం జగన్ ను కోరారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం విద్యుత్ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ గా కాంట్రాక్ట్ ఉద్యోగంతో పాటు రూ.2లక్షల ఆర్ధిక సహాయం అందించాలని కలెక్టర్ కు ఆదేశించారు. సీఎం ఆదేశాలను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ గౌతమి తక్షణ సాయంగా బాధితుడికి రూ.2లక్షల చెక్కు ను రామోంజీకి అందజేశారు. తన సమస్యపై వెంటనే స్పందించి ఆదుకున్నందుకు సీఎం జగన్, కలెక్టర్ గౌతమి లకు కృతజ్ఞతలు తెలియజేశాడు బాధితుడు.