Rajikanth Bala Krishna: సూపర్ స్టార్ రజినీ కాంత్ కాసేపటి క్రితం విజయవాడ చేరుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజినీ కాంత్ విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్టులో రజనీ కాంత్ ను సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేత తొండపు జనార్థన్, సావనీర్ కమిటీ రిసీవ్ చేసుకుని ఘన స్వాగతం పలికారు. బాలకృష్ణ, రజినీ కాంత్ ఆప్యాయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకోవడాన్ని అక్కడివారు ఆసక్తిగా తిలకించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవేళ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభకు రజినీ కాంత్ హజరవుతున్నట్లుగా ముందుగా ప్రకటించడంతో పెద్ద ఎత్తున అభిమానులు గన్నవరం ఎయిర్ పోర్టు వద్దకు చేరుకున్నారు. అభిమానులను కట్టడి చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. పోలీస్ బందోబస్తు మధ్య బాలకృష్ణ, రజినీకాంత్ ను తోడ్కొని ప్రైవేటు హోటల్ కు వెళ్లారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజినీకాంత్ కు తేనేటి విందు ఇవ్వనున్నారు. తదుపరి పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభ జరగనుంది. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై ఈ రోజు రెండు పస్తకాలను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రజినీకాంత్, చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకట నారాయణ సభలో పాల్గొననున్నారు.