ఏపి అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజైన గురువారం టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని సభలో నిరసన కొనసాగించారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభను స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.
అనంతరం ఈ మధ్య కాలంలో కన్నుమూసిన నేతలకు ఏపి అసంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులవర్తి నారాయణమూర్తి, జేఆర్ పుష్పరాజ్, నల్లమిల్లి మూలారెడ్డి మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు. అనంతరం బీఏసీ సమావేశం ప్రారంభమైంది. మరో పక్క శాసనమండలి సమావేశాలు ప్రారంభమైయ్యాయి. తొలుత నిరుద్యోగ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి అసెంబ్లీకి కాలినడకన నిరసన ర్యాలీగా చేరుకున్నారు.