ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మూహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 30వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 9గంటల నుండి సమావేశాలు ప్రారంభం కానున్నాయని నోటిఫికేషన్లో శాసనసభ కార్యదర్శి వెల్లడించారు.
కరోనా నేపథ్యంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయిదు రోజుల పాటు మాత్రమే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ బిల్లులు ప్రవేశపెట్టాలి, వేటి గురించి చర్చించాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు.
ఈ ఏడాది జూన్ నెలలో బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత శీతాకాల సమావేశాలను అక్టోబర్ నెలలో నిర్వహించాలని ప్రభుత్వం భావించినా కుదరలేదు. కరోనా నేపథ్యంలో తాజా అసెంబ్లీ సమావేశాలకు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు.