AP CM YS Jagan: ఇటీవల టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధ్యక్షుడు రాబోయే ఎన్నికలకు సంబంధించి మొదటి మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టో పై ఇప్పటికే వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండగా, తాజాగా ఆ మ్యానిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇవేళ కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధి డబ్బులను సీఎం జగన్ పంపిణీ చేశారు. బటన్ నొక్కి రైతుల ఖాతాలో నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతులకు మంచి చేయాలనే తాపత్రయం తో పథఖాలు రూపొందిస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దాని కన్నా మిన్నగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. నాలుగేళ్ల వరకూ ఇస్తామని మేనిఫెస్టో ప్రకటించామని కానీ ఇప్పుడు అయిదేళ్ల వరకూ ఇస్తామన్నారు. ఇప్పటి వరకూ ప్రతి రైతుకు రూ.54వేలు ఇచ్చామన్నారు.
రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకూ రూ.31 కోట్లు పంపిణీ చేశామన్నారు. సీజన్ ముగిసే లోగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తామన్నారు. ఇదే సందర్భంలో మరో సారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు గుప్పించారు సీఎం జగన్. బాబు బతుకే కాపీ, మోసం, చంద్రబాబుకు క్యారెక్టర్, క్రెడిబిలిటీ రెండూ లేవని విమర్శించారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులేని పార్టీ టీడీపీ అని అన్నారు. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ టీడీపీ అని విమర్శించారు. పొత్తుల కోసం ఎలాంటి గడ్డికరవడానికైనా సిద్దపడే పార్టీ టీడీపీ అని మండిపడ్డారు. పొత్తులు, ఎత్తులు, కుయుక్తులు కలగలపిన పార్టీ టీడీపీ అని దుయ్యబట్టారు. మంచి చేయడం చంద్రబాబు డిక్షనరీలోనే లేదని అన్నారు. ఎవరికైనా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబుది అధికారం కోసం ఆరాటమనీ, దోచుకుని, దాచుకుని నలుగురూ పంచుకోవడానికే వీరి పోరాటమని విమర్శించారు. ధైర్యంగా ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదని మరో సారి విమర్శించారు.
చంద్రబాబు మేనిఫెస్టో ఏపిలో పుట్టలేదనీ, చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందన్నారు. కర్ణాటక రెండు పార్టీల మేనిఫేస్టోతో బిస్మిల్లా బాత్ వండేశాడనీ, అన్ని పార్టీల పథకాలను కాపీ చేసేసి మేనిఫెస్టో తీసుకొచ్చాడని, మన పథకాలను కాపీ కొట్టేసి పులిహోర కలిపేశాడని జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఆకర్షనీయమైన మేనిఫెస్టో..తర్వాత గెలిపించిన ప్రజలను పొడవడం బాబు పొలిటికల్ ఫిలాసవీ అంటూ ఫైర్ అయ్యారు. మేనిఫోస్టో ఎలా రూపొందించాలో బాబుకు తెలుసా అని ప్రశ్నించారు. ప్రజల గుండె చప్పుడుగా వైసీపీ మేనిఫెస్టో పుట్టిందన్నారు. డ్రామా కంపెనీ మాదిరిగా రాజమండ్రిలో మహానాడు నిర్వహించారని విమర్శించారు సీఎం జగన్.