(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
అంతర్వేది శ్రీలక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయ రథం దగ్ధం ఘటనపై బిజెపి, జనసేన పార్టీలతో పాటు హింధూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డిఒ, తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బిజెపి, జనసేన పిలుపు నిచ్చింది. ఘటనపై ప్రభుత్వం పోలీసు దర్యాప్తు కొనసాగిస్తుండగా బిజెపి, జనసేన మాత్రం జ్యూడిషియల్ విచారణను డిమాండ్ చేస్తున్నాయి. వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు కూడా ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో ఎనిమిది గంటల పాటు నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నేటి చలో అంతర్వేది కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం పరిమిత సంఖ్యలో నాయకులతో అంతర్వేదికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్వేది ఆలయానికి స్పెషల్ అఫీసర్ను నియమించింది. స్పెషల్ ఆఫీసర్గా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ను నియమిస్తూ కొత్త రథం నిర్మాణం, ఇతర పరిస్థితులను కొలిక్కి తీసుకురావాలని ఆదేశించింది. 15 రోజుల పాటు అంతర్వేదిలోనే ఉండి అన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది.
కాగా రథం అగ్నికి ఆహుతి అయిన ఘటనను పరస్కరించుకొని ఆలయ ఇన్చార్జి ఇఒ చక్రధరరావును బదిలీ చేయడంతో పాటు సిసి కెమెరాల విభాగంలో పని చేసే ఇద్దరు ఉద్యోగులను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరో పక్క అయిదు ప్రత్యేక బృందాలు ఘటనపై దర్యాప్తు చేపట్టాయి.