రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నూతన ఇసుక పాలసీ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ఉచిత ఇసుక విధానానికి స్వస్తి పలికి నూతన ఇసుక విధానం తీసుకురావడంతో కొనుగోలు దారులకు అటు ఇసుక సీనరేజ్ ఖర్చు, ఇటు రవాణా చార్జీలు కలిసి తడిసిమోపెడు అయ్యింది. దీనికి తోడు రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం, ఇసుక, సిమెంట్ ధరల పెరుగుదలతో నిర్మాణ రంగం కూదేలైంది. ఈ రంగంపై ఆధారపడిన జీవిస్తున్న లక్షలాది కూలీలు పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు క్షేత్ర పరిస్థితులను ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. నిర్మాణ రంగం పుంజుకోవలంటే ఇసుక ధర తగ్గించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంతకు ముందే స్థానికులు తమ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా అయితే ఉచితంగా తీసుకువెళ్లే సదుపాయాలన్ని ప్రభుత్వం కల్పించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపిలో ఇసుక ధర తక్కువే అయినప్పటికీ ఇసుక సరఫరా విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొత్త ఇసుక పాలసీ కోసం మంత్రివర్గ ఉప సంఘం పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఇసుక విధానాలపై అధ్యయనం చేసింది. వినియోగదారుడికి రవాణా భారం తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేలా నూతన ఇసుక పాలసీలో మార్పులు చేయాలని భావిస్తున్నారుట. ప్రస్తుతం అమలు అవుతున్న ఇసుక పాలసీలో లోపాలు గమనించి వాటిని సవరించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారుట. ఇసుక రీచ్ లు ఉన్న ప్రదేశాలకు 8 కిలో మీటర్ల పరిధిలోని ప్రజానీకం నేరుగా ఇసుక ఉచితంగా రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించడం వల్ల ఆయా ప్రాంతాల్లోని స్థానికులు సంతృప్తి చెందుతారని భావిస్తున్నారు. డంపింగ్ యార్డ్ లు కూడా అనవసరం అని వాటిని ఎత్తివేయాలని యోచన చేస్తుందట.
మరో పక్క ఇసుక ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర్చుకోవాలన్న మరో ఆలోచనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు ఒక్కరికే అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. టెండర్ విధానం ద్వారా ఒకరికే అప్పగిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. వ్యాపార అవసరాలకు కోసం తోలుకునే వారి నుండి ఎక్కువ మొత్తం ధర నిర్ణయించి వసూలు చేస్తారు. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఇసుక భారం కాకుండా కేవలం ధనిక వర్గాలపై మాత్రమే ఎక్కువ భారం వేసేలా నూతన ఇసుక పాలసీలో మార్పులు ఉంటాయని అనుకుంటున్నారు.